ఖలీల్వాడి, నవంబర్ 1: జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు మంగళవారం పురస్కారాలను అందజేశారు. నూతన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేసి సన్మానించారు. అనంతరం అతిథు లు మాట్లాడుతూ.. కరోనా బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నామన్నారు. దాదాపు రెండేండ్లు అందరూ ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ముఖ్యంగా విద్యావ్యవస్థపై పడిందని, దీంతో చాలా నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం వంద శాతం సిలబస్తో ఈ విద్యాసంవత్సరం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ సంవత్సరం క్యాలెండర్ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల తర్వాత దైవం గురువని అన్నారు. వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు పొందుతారని అన్నారు. కార్యక్రమంలో డీఈవో దుర్గాప్రసాద్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.