‘బండి’పై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. సంజయ్ సారీ చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోమవారం ఉమ్మడి జిల్లాలో ఉద్యోగుల నిరసనలు మిన్నంటాయి. భోజన విరామ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. వంకర మాటలు మాట్లాడే సంజయ్ ఇక నుంచైనా మారాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం ఉద్యోగులతో పెట్టుకోవద్దని టీఎన్జీవో నేతలు హితవు పలికారు. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బీజేపీ అధ్యక్షుడి మాటలపై ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది.
నిజామాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వారంతా సోమవారం నిరసన వ్యక్తంచేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బండి సంజయ్ లాంటోళ్లు తీరు మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు సత్ప్రవర్తనతో మెలగాలంటూ సూచించారు. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ వంకరగా మాట్లాడడంతో కిందిస్థాయిలో శ్రేణులకు ఎలాంటి సందేశాన్ని పంపుతున్నారంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యోగులను చిన్నచూపుగా చూడడం, హేళనగా మాట్లాడడం సబబు కాదంటూ ప్రజలు సైతం అంటున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడాన్ని అలవాటుగా మార్చుకున్న బీజేపీ నేతలకు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అభిప్రాయపడుతున్నారు.
ఆది నుంచీ వంకర మాటలే..
భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుల తీరు చాలా రోజులుగా విమర్శలకు తావిస్తున్నది. కిందిస్థాయి లీడర్ల దగ్గరి నుంచి మొదలు పెడితే పైస్థాయి వరకు అంతా ఒక్కటే విధానాన్ని అవలంబిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన అమిత్ షా, ఆ తర్వాత ఇప్పుడు ఆ హోదాలో కొనసాగుతున్న జేపీ నడ్డా సైతం ప్రజలను రెచ్చగొట్టడం, ఇతర పార్టీల నాయకులపై ద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం రివాజుగా మారింది. వారిని చూసి రాష్ట్ర నాయకత్వం కూడా నోటికొచ్చినట్లు బూతు పురాణాలను వల్లె వేస్తున్నది. ఈ తరహా విష సంస్కృతిని కాషాయ పార్టీ పెంచి పోషిస్తున్నది.
ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులపై ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆయా వర్గాల ప్రజల మద్దతును చూరగొనాలంటే ప్రభుత్వాలు జనాలు మెచ్చే పథకాలను తీసుకురావాలి. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిర్వహించాలి. అది చేతకాని కేంద్ర ప్రభుత్వం ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్లుగా ఎదురుదాడి చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఉద్యమం నుంచి నేటి వరకు ఉద్యోగులకు కొండంత అండగా నిలుస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆ వర్గం ప్రేమాభిమానాలను చూరగొన్నారు. ఇది సహించని బీజేపీ కుటిల ప్రయత్నాలతో అక్కసును వెళ్లగక్కుతున్నది. మునుగోడు ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక ఎదుటి వారిపై బురద జల్లుతూ బీజేపీ మైండ్గేమ్ ఆడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
అంతటా అదే తీరు..
బండి సంజయ్ మాదిరిగానే నిజామాబాద్ జిల్లాలో కాషాయ శ్రేణులు నిత్యం విష ప్రచారాలతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్టాగ్రామ్, ట్విట్టర్తోపాటు వాట్సాప్లలో ఇష్టారీతిన అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతున్నారు. రాష్ట్రస్థాయి ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై బురద జల్లుతున్నారు. అత్యున్నత హోదాలో ఉన్న వారిని ఇష్టారీతిన దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఒకటి కాదు… వందల సంఖ్యలో అసత్యపు పోస్టులతో జనాల్లో గందరగోళం సృష్టించి బీజేపీ కుహన తెలివి తేటలను ప్రదర్శిస్తున్నది. ఇక నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నోరు తెరిస్తే బూతులు తప్ప.. మంచి మాటలు రావన్న సంగతి ప్రజలందరికీ తెలిసిందేనన్న అభిప్రాయం ఉన్నదే. అభివృద్ధి, ప్రజల బాగోగులపైన మాట్లాడేందుకు బీజేపీ ప్రజా ప్రతినిధులు ఏనాడూ సాహసించరు. అలాంటిది ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలతో సామాన్య ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుండగా… ఉద్యోగుల్లోనూ అసంతృప్తి పెరిగిపోతున్నది.
బండి సంజయ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి
ఉద్యోగ సంఘాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్జీవోస్, టీజీవో ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నల్లబ్యాడ్జీలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించడం బండి సంజయ్కు తగదని అన్నారు. టీఎన్జీవోస్పై నోరు పారేసుకున్న బండి సంజయ్ ఉద్యోగ సంఘాలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం జీతాలు, జీవితాలను పణంగా పెట్టిన చరిత్ర ఉద్యోగ సంఘాలదని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సాయిలు, టీజీవో జిల్లా అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి నాగరాజు, కోశాధికారి దేవరాజు, ఉపాధ్య క్షులు చక్రధర్, పోచయ్య, జాయింట్ సెక్రటరీ రాజ్యలక్ష్మి, గణేశ్, చలపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం
టీఎన్జీవోస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని టీఎన్జీవోస్ నాయకులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యం లో జిల్లాకేంద్రంలోని నూతన కలెక్టరేట్ కా ర్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని బహిష్కరించి అన్నిశాఖల అధికారులు, ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలుక కిషన్ మాట్లాడారు. 75 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న టీఎన్జీవోస్ సంఘం తెలంగాణ ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించిందని, రాష్ట్రం సిద్ధించేందుకు పోరాడిందని అన్నారు. అలాంటి టీఎన్జీవోస్ నాయకులపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే టీఎన్జీవోస్ నాయకులు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సంఘం అమృత్కుమార్, సహాధ్యక్షుడు చిట్టి నారాయణరెడ్డి, సభ్యులు శేఖర్, జాఫర్ హుస్సేన్, పోల శ్రీనివాస్, సత్యం, అతీఖ్ అహ్మద్, అర్బన్ యూనిట్ అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, రూరల్ అధ్యక్షుడు దినేశ్ బాబు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
వెంటనే క్షమాపణలు చెప్పాలి..
టీఎన్జీవోస్ నాయకులపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణలు చెప్పాలి. రాష్ట్ర ప్రజల కోసం ఉద్యమాలు చేసిన ఘనత మాది. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం.
– అమృత్కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి, నిజామాబాద్
ప్రాణాలను పణంగా పెట్టిన ఘనత ఉద్యోగులది..
బండి సంజయ్ ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టిన ఘనత మా ఉద్యోగులదే. సంజయ్ పిచ్చి ప్రేలాపనలు ఆపకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
– సాయిలు, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి, కామారెడ్డి