విద్యానగర్/ ఖలీల్వాడి, మార్చి 25 : ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనఊరు-మనబడి కార్యక్రమం లో పనులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చే యాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, విద్యాశాఖ, వివిధ ఇంజినీరింగ్ శాఖల అధికారులతో శుక్రవా రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం వంటి పనులను చేపట్టాలని అన్నారు.
పనుల అంచనాలను సిద్ధం చేసి పరిపాలనా అనుమతుల కోసం ఉపాధి హామీ సాఫ్ట్వేర్లో పొందుపరచాలని సూచించారు. సదుపాయాల మెరుగుదలకు దోహదపడే పనులను మాత్రమే కొత్తగా చేపట్టాని సూచించారు. పాఠశాలలో సుందరీకరణ, పచ్చదనం,ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పనులు చేపట్టాలని అన్నారు. మన ఊరు – మనబడి కార్యక్రమానికి ప్రతి ఒక్కరి భాగస్వా మ్యం అవసరమని తెలిపారు. ప్రతి మండలంలో రెండు పాఠశాలలకు సంబంధించిన పనులు తక్షణమే ప్రారంభమయ్యేలా చొరవ చూపాలని సూచించారు. నిజామాబాద్లో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.