ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవనం.. పని ఒత్తిళ్లతో ప్రశాంతత కరువైన జీవితం.. ఇలాంటి తరుణంలో ఆధ్యాత్మిక చింతన వైపు అందరి దృష్టి నెలకొంటున్నది. మానసిక ప్రశాంతత కోసం దేవుడి సన్నిధిలో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. కార్తిక మాసం ఆరంభం కావడంతో అయ్యప్ప మాలధారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. మరోవైపు, బ్రహ్మోత్సవాలకు నింబాచల క్షేత్రం ముస్తాబైంది. కొండపై కొలువైన శ్రీలక్ష్మీనారసింహుడు పది రోజుల పాటు ప్రత్యేక పూజలందుకోనున్నాడు.
భీమ్గల్, అక్టోబర్ 29: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల పరిధిలో శ్రీ లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రం నింబాచలంగా(లింబాద్రి గుట)్టగా విలసిల్లుతున్నది. ఏటా కార్తికమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నింబాచలం కాలక్రమేనా లింబాద్రి గుట్టగా రూపాంతరం చెందింది. పూర్వం గుట్టప్రాంతం మొత్తం వేప చెట్లతో ఉండడంతో ఈ గుట్టకు నింబాచలంగా పేరు వచ్చినట్లు చెబుతుంటారు.
ఉత్తర భారతదేశంలోని బద్రీనాథ్లో మాత్రమే నరనారాయణులు కొలువై ఉన్నారని తర్వాత లింబాద్రి గుట్టపై మాత్రమే నరనారాయణులు కొలువైన దివ్యధామం అని పండితులు చెబుతుంటారు. అందుకే దీనిని దక్షిణబద్రీగా పిలుస్తారు. ఈ కొండపై జోడు లింగాలు ఉండడం విశేషం. వీటిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ స్థల పురాణాన్ని వశిష్ఠముని మాన్దాత రాజుకు, వేదవ్యాసుడి ద్వారా జయమే జయరాజు, మార్కండేయ మహామునులకు కథలుగా బోధించినట్లు ప్రతీతి.
లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను నంబి వంశస్థులు ఏటా నిర్వహించడం ఆనవాయితీ. కేవలం నంబి వంశస్థులు మాత్రమే స్వామి వారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్తగా నంబి లింబాద్రి వ్యవహరిస్తున్నారు.
నింబాచల క్షేత్రంలో బ్రహ్మదేవుడు, ప్రహ్లాదుడు, వాయుదేవుడు, ఇంద్రుడు తపస్సు చేసి ముక్తి పొందారని స్థల పురాణం చెబుతున్నది. ఈ ఆలయంలో మాత్రమే స్వామి వారికి బిల్వపత్రం(పత్రి) సమర్పిస్తారు. దీనికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. యమధర్మరాజు ఈ క్షేత్రంలో తపస్సు చేశాడని స్వామి వారి వరంతో ఈ కొండపై బిల్వ వృక్షంగా వెలిశాడని వేద పండితులు చెబుతుంటారు. అందుకే స్వామికి పత్రిని సమర్పిస్తుంటారు. అష్టాదశ పురాణాల్లో ఒకటైన వైష్ణవ పురాణంలో ఈ క్షేత్రం గురించి వివరించారు. గర్భాలయంలో స్వామి వారి ఉత్సవమూర్తి ఎడమ వైపు లక్ష్మి, కుడివైపు కృష్ణార్జులు, హనుమంతుడు స్వయంగా ఈ క్షేత్రంలో కొలువయ్యారు.
కొండపై ఉన్న కమల పుష్కరిణికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ పుష్కరిణిలోని నీటిని కేవలం స్వామి వారి నిత్యాది పూజా కార్యక్రమాలకు వాడుతుంటారు. పుష్కరిణి మొత్తం రాతి కట్టడంతో సుందరంగా ఉంటుంది. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులను ఊరేగించేందు కు నూతనంగా ఇనుప రథాన్ని తయారు చేయించారు. గతంలో ఈ కొండకు వచ్చేందుకు రవాణా సౌకర్యం అంతంత మాత్రంగానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఇటీవల రూ.2కోట్ల 60లక్షలతో కొండపైకి ఏర్పాటు చేసిన నాలుగు లైన్ల రోడ్డు, సెంట్రల్ లైట్లు, గిరి ప్రదక్షిణలతో గుట్ట ప్రాంతం అందంగా కనబడుతుంది. ప్రతి శని, ఆదివారాల్లో గుట్టపై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో జాతర(ఉత్సవాల)సమయంలో మాత్రమే పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు. కానీ, ప్రస్తుతం ప్రతి శని,ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే భక్తులు గిరి ప్రదక్షిణ చేసేవారు. రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రోడ్డు వేయడంతో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.