ఇందూరు, అక్టోబర్ 29 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించరాదని, పక్కాగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని వెంగళ్రావునగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం), వినాయక్నగర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు మన ఊరు -మన బడి కింద చేపట్టిన పనులను పరిశీలించారు.
నూతన గదులు, కిచెన్, సంప్ నిర్మాణాలు, ఫ్లోరింగ్, రెయిలింగ్, వాటర్ పైపులైన్ కనెక్షన్లు, విద్యుద్దీకరణ తదితర పనులను పరిశీలించి, చిన్నచిన్న లోపాలను గుర్తించారు. లోపాలను సరిచేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, నాసిరకంగా పనులు జరిపిస్తే మన ఊరు – మన బడి కార్యక్రమం లక్ష్యం దెబ్బ తింటుందన్నారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఏ చిన్న పనిని కూడా అసంపూర్తిగా విడిచి పెట్టకూడదని అధికారులను ఆదేశించారు. పాఠశాల తరగతి గోడలపై పగుళ్లకు మరమ్మతులు చేసిన తరువాతే రంగులు వేయించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఈఈ దేవీదాస్, డీఈ అంజిరెడ్డి, ఏఈ ఉదయ్కిరణ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, గంగాధర్ పాల్గొన్నారు.