బోధన్, అక్టోబర్ 16 : బోధన్ పట్టణంలోని రైల్వేశాఖకు చెందిన భూములు పిచ్చిమొక్కలు , మురికి కూపాలతో దర్శనమిస్తున్నాయి. దేశ ప్రధాని గొప్పగా చెప్పుకుంటున్న ‘స్వచ్ఛ భారత్’ ఛాయలు ఇక్కడ మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ రైల్వే స్థలాలకు ఆనుకుని నివాసముంటున్న ప్రజలు రైల్వేశాఖ భూములు మురికికూపాలుగా మారడంతో వెలువడుతున్న దుర్గంధంతో నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. బోధన్ పట్టణంలో రైల్వేగేట్ మొదలు బోధన్ రైల్వే స్టేషన్ వరకు రైల్వేశాఖ పరిధిలో విశాలమైన భూములు ఉన్నాయి. సుమారు 150 ఎకరాల విస్తీర్ణం మేరకు ఈ స్థలాలు ఉన్నాయి.
ఇందులో బోధన్ రైల్వే స్టేషన్, స్టేషన్లోని ప్లాట్ఫారాలను మినహాయిస్తే.. మిగతా స్థలాలన్నీ అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. అనేక దశాబ్దాలుగా ఈ భూములను శుభ్రపర్చలేదు. విచ్చలవిడిగా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించలేదు. ఎత్తుపల్లాలతో ఉన్న ఈ భూముల్లో వర్షాలకు చేరిన నీరు అక్కడే నెలల తరబడి నిల్వ ఉండడంతో మురికి కూపాలుగా మారాయి. ఈ మురికి నీరు రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ఆ దారి వెంట వెళ్లేవారు చికాకుపడుతున్నారు. దట్టంగా మొలచిన పిచ్చిమొక్కల్లోకి మనిషి వెళ్లే సాహసం కూడా చేయలేని పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది.
రైల్వే స్టేషన్కు సమీపంలో లయన్స్ కంటి దవాఖాన ఉంది. దవాఖాన ప్రహరీని ఆనుకుని ఉన్న రైల్వే స్టేషన్ స్థలంలో మురికినీరు నిలిచిపోయి దుర్గంధం వస్తున్నది. రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రపర్చాలని, స్వచ్ఛ భారత్ను రైల్వేశాఖ అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. అయినప్పటికీ, రైల్వేశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. ఈ రైల్వే స్థలాల్లో అధికారులు ఒక మొక్కను కూడా నాటలేదు. వారు నాటకపోగా, బోధన్ మున్సిపాలిటీ గానీ, స్వచ్ఛంద సంస్థలు గానీ ‘హరితహారం’ కింద మొక్కలు నాటుకోవడానికి కూడా రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వలేదు.
బోధన్ మున్సిపాలిటీలో ‘హరితహారం’ విజయవంతంగా అమలవుతుండగా, స్వచ్ఛ భారత్ అంటూ గొప్పలు వేసుకునే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వేశాఖ ఆ విషయాన్ని విస్మరించడం గమనార్హం. రైల్వే స్థలాలను శుభ్రపర్చుకొని, మొక్కల పెంపకం చేపట్టినట్లయితే బోధన్ పట్టణానికి కొత్త శోభ వచ్చేది.. ఇకనైనా రైల్వే స్థలాలను శుభ్రపర్చాలని, పట్టణ ప్రజల ఆరోగ్యానికి ముప్పు గా ఉన్న మురికికూపాలను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రైల్వే అధికారులను సంప్రదించగా, ఎవరికీ వారే అది తమ పరిధిలో లేదంటూ తప్పించుకుంటున్నారు. ఈ విషయమై బోధన్ రైల్వే స్టేషన్ మాస్టర్ రమేశ్ను ‘నమస్తే తెలంగాణ’ వివరణ అడగగా, అది తమ పరిధిలో లేదని, రైల్వేభూములకు సంబంధించి ప్రత్యేకంగా ఇంజినీరింగ్ శాఖ ఉందని, హైదరాబాద్లో సంబంధిత ఉన్నతాధికారి ఉంటారని సమాధానం చెప్పారు.