ఇందూరు/విద్యానగర్/నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 12 : ఉమ్మడి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ తెలిపారు. పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ జనార్దన్రెడ్డి హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లకు సూచనలు చేశారు. బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల వేలిముద్రలను తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. ప్రతి పరీక్షా గదిలో తగిన సదుపాయాలు కల్పించాలని, చీఫ్ సూపరింటెండెంట్లు ముందుగానే క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ఉదయం 10.15 గంటల తర్వాత గేట్లను మూసివేసి అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించకూడదని సూచించారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు గ్రౌండ్ఫ్లోర్లోనే వసతి కల్పించాలన్నారు. పరీక్షా సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను బయటికి వెళ్లేందుకు అనుమతించాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లపై కలెక్టర్ నారాయణరెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఇందుకోసం నగరంలో 40 సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులకు సందేహాలు, సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు 08462-220183 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని చైర్మన్కు తెలిపారు. తహసీల్దార్లను లైజనింగ్ ఆఫీసర్లుగా నియమించి ఇప్పటికే అన్ని కేంద్రాలను పరిశీలించామన్నారు. డ్యుయల్ డెస్కులు, ఎలక్ట్రీసిటీ, ఫ్యాన్స్, టాయిలెట్స్, తాగునీరు వంటి సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ప్రతి సెంటర్కూ ఒక ఏఎన్ఎం, ఆశ వర్కర్ను నియమిస్తున్నామని వివరించారు.
ప్రశ్నపత్రాలు, ఇతర సామగ్రిని బందోబస్తు మధ్య సీసీ కెమెరాల నిఘాలో భద్రపరుస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశామని తెలిపారు. సీపీ నాగరాజు మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి కేంద్రం వద్ద మహిళా సిబ్బందిని కూడా నియమిస్తున్నామని, బస్టాండ్లు, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు సహాయపడేందుకు లైజన్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసరమైతే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు చేరవేసేందుకు వీలుగా వాహనాలను కూడా అందుబాటులో ఉంచుతామని చైర్మన్ దృష్టికి తెచ్చారు. సెంటర్లకు వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీపీ అరవింద్బాబు, ఆర్డీవో రవి, డీఐఈవో రఘురాజ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పవన్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో 4,549 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ జితేశ్ పాటిల్ చెప్పారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు హెల్ప్డెస్క్ (9989215590)ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఈమేరకు ఎస్పీ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.