కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుమతి లేకుండానే బడులకు డుమ్మా కొడుతున్నారు. ఇష్టమొచ్చిన సమయానికి పాఠశాలకు వస్తున్నారు. నిర్ణీత సమయం కాకముందే వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో బయోమెట్రిక్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఈ విధానం అమలవుతుండగా, త్వరలోనే నిజామాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లోనూ బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేయనున్నది. దీంతో నెలల తరబడి పాఠశాలల ముఖం చూడని డుమ్మా టీచర్లలో వణుకు మొదలైంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వేలి ముద్రల ద్వారా హాజరును తీసుకోవడం ద్వారా కచ్చితత్వం పెరుగనున్నది. ఉపాధ్యాయుడు కచ్చితంగా రోజుకు రెండు సార్లు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్తో ఆన్లైన్ విధానంలోనే వేలిముద్రతో హాజరు నమోదు కానుండడంతో పారదర్శకత పెరుగుతుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన మరింత బలోపేతం కానున్నది. నిజామాబాద్ జిల్లాలో 5,197 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆయనొక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఓ ఉద్యోగ సంఘంలో నాయకుడు కూడా. తెల్లారితే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విద్వేషం చిందించడమే ఆయన పని. రోడ్లపై ఎవరైనా ఎదురైతే నీతులు వల్లించడం తప్ప అతను చేసే విధి మాత్రం చేయడు. స్కూల్ సమయానికి చాయ్ హోటళ్లలో తారస పడడం మినహా బడిలో కనిపించిన దాఖలాలే లేవు. నిత్యం సమస్యల పేరిట ఆందోళన కార్యక్రమాలు చేయడం మినహాయిస్తే చాక్పీస్ పట్టింది లేదు.
పాఠా లు బోధించింది లేదు. ఇతనిపై చర్యలకు విద్యా శాఖ ఉన్నతాధికారులే వెనుకడుడు వేస్తారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటే తమ తప్పులు ఎక్కడ బయట పెడతారేమోనని భయమే అందుకు కారణం. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ పోవడంతో నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియ గాలి మూటగా మారింది. విధులకు డుమ్మా కొట్టే ఘటనలకు చెల్లు చీటి పడేలా నిజామాబాద్ జిల్లాలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో డుమ్మా మాస్టర్లలో వణుకు మొదలవుతున్నది. తెలంగాణ స్టేట్ టెక్నాలాజికల్ సర్వీసెస్ సిబ్బందితో సమన్వయం చేసుకొని బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని చెప్పడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిలో వణుకు మొదలైంది.
ప్రస్తుతం 14 జిల్లాల్లో ఉపాధ్యాయులకు బయెమెట్రిక్ హాజరు విధానం అమలవుతున్నది. అదనంగా మరో నాలుగు జిల్లాలను జోడించారు. ఇందులో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలతో పాటు మన జిల్లా సైతం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 1,156 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం మంజూరైన ఉపాధ్యాయుల సంఖ్య 5916 కాగా ప్రస్తుతం 5197 మంది పని చేస్తున్నారు. 719 ఖాళీలున్నాయి. 5వేల మంది ఉపాధ్యాయులకు త్వరలోనే బయోమెట్రిక్ ఆధారిత హాజరును తీసుకోబోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వేలి ముద్రల ద్వారా హాజరును తీసుకోవడం ద్వారా కచ్చితత్వం పెరుగనున్నది. తద్వారా సమయానికి స్కూళ్లకు రాకుండా ఇష్టారాజ్యంగా తిరిగే వారందరికీ కాసింత అడ్డుకట్ట పడనున్నది. ఉదయం ఠంచనుగా బడికి వచ్చే వారికి ఈ నిర్ణయం ఊరటను ఇస్తుండగా నిత్యం లీడర్లమంటూ చెప్పుకొని తిరిగే వారికి ఆశనిపాతంలా మారబోతున్నది. స్కూళ్లకు నెలల తరబడి ముఖం చాటేస్తూ కొద్దిమంది ప్రజాప్రతినిధుల పేర్లను వాడుకుంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తున్న వారి వివరాలు ఇప్పటికే విద్యా శాఖకు చేరాయి. ఉపాధ్యాయ వర్గానికి చెందిన వారే ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. అలాంటి వ్యక్తుల మూలంగా జిల్లా పేరు కాస్త రాష్ట్ర స్థాయిలో అపకీర్తిని మూట కట్టుకుంటున్నది.
అనేకచోట్ల స్కూళ్లలో ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకపోవడం, సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడం చోటు చేసుకుంటున్నది. ఈ విషయంపై జిల్లా పరిషత్, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ప్రజా ప్రతినిధులే ఫిర్యాదులు చేస్తున్నారు. మండల విద్యా శాఖ అధికారులు, జిల్లా విద్యా శాఖ అధికారి ఈ విషయాలపై కనీసం పట్టనట్లుగా వ్యవహరించడం ద్వారా ఇష్టారాజ్యమన్నది పేట్రేగి పోయింది. బయోమెట్రిక్ విధానం అమలు చేయడం ద్వారా కచ్చితంగా సెలవుల్లో లేని ఉపాధ్యాయుడు రోజుకు రెండు సార్లు వేలి ముద్ర వేయాల్సిందే. ఇందుకోసం చైల్డ్ ఇన్ఫోలో పాఠశాలల వారీగా ఆధార్ వివరాలతో నమోదు చేసిన ఉపాధ్యాయుల వివరాలను బయో మెట్రిక్ యంత్రంలో పొందుపరుస్తున్నారు. వారు పాఠశాలలకు ఉదయం హాజరైన సమయం, సాయంత్రం స్కూల్ ముగిశాక వెళ్లిన సమయం కూడా నమోదు అవుతుంది. బయోమెట్రిక్ సమాచారం ఏకంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి, రాష్ట్ర విద్యా శాఖకు అనుసంధానం అవుతుంది. బయోమెట్రిక్ హాజరుకు తోడు నిత్యం ప్రధా నోపాధ్యాయులు తమ పైఅధికారులకు హాజరు వివరాలను పంపించాల్సి ఉంటుంది. ఏదైనా కారణాలతో యంత్రాలు పని చేయకుంటే ప్రధానోపాధ్యాయుల వద్ద ఉండే వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రభుత్వ స్కూళ్లలో నిరంతరం తనిఖీలు చేస్తున్నాను. నేను స్వయంగా చేసిన పరిశీలనలోనూ చాలా చోట్ల ఉపాధ్యాయులు సమాచారం లేకుండా డుమ్మా కొట్టిన సందర్భాలు వెలుగు చూశాయి. బయోమెట్రిక్ అమలు చేయడం ద్వారా పారదర్శకత అన్నది పెరుగుతుంది. విద్యాశాఖ ఆదేశాలతో బయోమెట్రిక్ను స్కూళ్లలో అమర్చి కొద్ది రోజుల్లోనే వేలి ముద్ర ఆధారిత హాజరును ఉపాధ్యాయులకు అమలు చేస్తాం.
– దుర్గా ప్రసాద్, నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి