పిట్లం, అక్టోబర్ 4 : మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామశివారులో గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి కోరికలు తీర్చుతాడని భక్తులు నమ్మకం. ఆలయంలోని స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రావణ, కార్తీక మాసాలతో పాటు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఏడాది పొడువునా ప్రతి సోమవారం ఆలయం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఎంతో విశిష్ఠత ఉన్నదని పెద్దలు చెబుతుంటారు. శ్రీరాముడు వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాడని, ఆయన పూజించే శివలింగం ఈ ప్రాంతంలో కనిపించకపోవడంతో తానే ఓ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించడంతో ఈ ఆలయాన్ని రామలింగేశ్వర ఆలయంగా పిలుస్తారని తెలిపారు. ఆలయం ఎదుట కోనేరు, శివాలయం, ఇరువైపులా పార్వతీదేవి, పాండురంగని ఆలయాలతో పాటు దత్తాత్రేయ, హనుమాన్ ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి.
దగ్గరలోనే నవనాథులగుట్ట, మునిగుట్ట, నాగలోకం ఉన్నట్లు భక్తులు చెబుతారు. ఈ ఆలయానికి ప్రతి శ్రావణమాసంలో చుట్టుపక్కల రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఏడాది కిందట ఆలయ పునఃనిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో.. ఆలయ కమిటీ బాధ్యులు నూతన ఆలయాన్ని నిర్మించారు. భక్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో నాపరాళ్లు, జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు.
కాలినడకన వెళ్లే దారిని ఏకంగా వాహనాలు కూడా గుట్టపైకి వచ్చేవిధంగా నిర్మించారు. అప్పటి నుంచి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. ఆలయాన్ని దేవాదయ, ధర్మాదాయశాఖ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.
భక్తుల కోరికలు తీర్చే స్వామి..
ఇక్కడ నెలకొన్న రామలింగేశ్వర స్వామి భక్తుల కోరికలు తీరుస్తాడు. గుట్టపై, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉన్నది.
– శ్యామ్జోషి, ఆలయ పూజారి