ఖలీల్వాడి, అక్టోబర్ 4: దేశ రాజకీయాల్లో కేసీఆర్ సేవలు అవసరమని, ఆయన వెంటే మేమంతా ఉంటామని క్రైస్తవ మత పెద్దలు మద్దతు ప్రకటించారు. నిజామాబాద్లోని సీఎస్ఐ చర్చిలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో క్రైస్తవ మత పెద్దలు మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చర్చి ఆఫ్ సౌత్ ఇండియా సీఎస్- మెదక్ డయాసిస్ బిషప్ ఏసీ సోలమాన్ రాజ్ తెలిపారు. కేసీఆర్కు దేవుడి ఆశీస్సులు ఉంటాయని, దేశం సెక్యులర్గా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. మతతత్వ పార్టీలతో దేశానికి ముప్పు పొంచి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ రక్షణకు తామంతా కేసీఆర్ వెంటే ఉంటామని తెలిపారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్కు భారీ మద్దతు
సీఎం కేసీఆర్ ప్రకటించే జాతీయ పార్టీకి క్రైస్తవ సంఘాలు భారీ మద్దతుని ప్రకటిస్తున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యవేక్షణలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు లక్షలాది మంది క్రిస్టియన్ కుటుంబాల మద్దతుని కూడగడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రిస్టియన్ సంఘాలు కేసీఆర్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు సమక్షంలో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సంస్థ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాని ప్రతులను ప్రగతిభవన్కు పంపించారు. హైదరాబాద్లో యంగ్మెన్ క్రిస్టియన్ అసోసియేషన్, పది లక్షల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎమ్సీఏ కూడా కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం.