మాక్లూర్, అక్టోబర్3 : కోతులకు భయపడి చెరువులో దూకిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడివి మామిడిపల్లిలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. మాక్లూర్ ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం దీపక్ అనే డిగ్రీ విద్యార్థితో కలిసి గ్రామానికి చెందిన బొల్లి రాజేశ్ (12) ఆయన త మ్ముడు హన్మాండు, అఖిలేశ్ అలియాస్ లక్కీ (12), అభిలాశ్ గ్రామ శివారులోని ఊరచెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో కోతుల గుంపు రావడంతో పటాకులు పేల్చి వెళ్లగొట్టారు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం కోతులు మళ్లీ గుంపుగా రావడంతో భయంతో ఐదుగురు చెరువులో దూకారు. హన్మాండ్లు, అభిలాశ్లను దీపక్ ముందుగా ఒడ్డుకు చేర్చాడు. రాజేశ్, అఖిలేశ్ తీసుకురావడానికి చెరువు లోకి వెళ్లగా అప్పటికే వారు నీటిలో మునిగిపోయారు. అతికష్టం మీద దీపక్ వారిద్దరిని ఒడ్డుకు చేర్చాడు. రాజేశ్ అప్పటికే మృతి చెందాడు. అఖిలేశ్ కొనఊపిరితో ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామానికి చెందిన బొల్లి రాజు, గోదావరికి ఇద్దరు సంతానం కాగా రాజేశ్ మృత్యువాత పడగా హన్మాండ్లు ప్రాణాలతో బయటపడ్డాడు.
శ్రీనివాస్, లతకు ఇద్దరు ఆడ పిల్ల లు, ఇద్దరు మగపిల్లలు కాగా చిన్న కుమారుడు అఖిలేశ్(లక్కీ) మృత్యువాత పడ్డాడు. రాజేశ్, హన్మాండ్లు డిచ్పల్లిలోని గురుకుల పాఠశాలలో 7,6వ తరగతులు చదువుతున్నారు. అభిలాష్ మామిడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా, అఖిలేష్(లక్కీ) డిచ్పల్లిలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. దసరా సెలవులు కావడంతో ఇంటికి వచ్చారు. దీపక్తో పాటు నలు గురు దుర్గామాత మాలలు ధరించి ఉన్నారు. చిన్నారులు చనిపోవడంతో ఇరుకుటుంబాలు శోక సంద్రం లో మునిగిపోయాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. బాధిత కుటుంబాలను ఎంపీపీ ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, సర్పంచ్ మల్లారెడ్డి, అధికారులు పరామర్శించారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు చిన్నారులను కాపాడిన దీపక్ను అభినందించారు