నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 1 : జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. శనివారం వివిధ గ్రామాలు, కళాశాలల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి మహిళలు ఆడిపాడారు. వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేశారు. అనంతరం సమీప చెరువులు, కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
జిల్లాకేంద్రంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో, నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, నగరంలోని స్నేహా సొసైటీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఆధ్వర్యంలో సంబురాలను ఘనంగా నిర్వహించారు. జక్రాన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఐకేపీ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో, సిరికొండ మండలంలోని కామధేను జూనియర్ కళాశాలలో, మోస్రా మండలకేంద్రంలో, రుద్రూర్ బొప్పాపూర్లో జడ్పీటీసీ సభ్యుడు నారోజి గంగారాం, సర్పంచ్ బాపూజీ సావిత్రీ లింగం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహించారు.
కోటగిరి మండల కేంద్రంతోపాటు సుంకిని, దోమలెడ్గిలో సంబురాలను ఘనంగా నిర్వహించారు. కోటగిరిలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్ బతుకమ్మలను పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా, కొండూర్ గ్రామాల్లో బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించారు. బోధన్ మండలంలోని కుమ్మన్పల్లి, పెద్దమావందిలో, భీమ్గల్ పట్టణంలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో, ఆర్మూర్లో ఐకేపీ(డీఆర్డీఏ) ఆధ్వర్యంలో, ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్ ఆధ్వర్యంలో, ఆర్మూర్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు బతుకమ్మ ఆడారు. ఏర్గట్లలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నవీపేట మండలంలోని నందిగామ, నాళేశ్వర్లో, బోధన్ పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో, దయానంద్ గోశాలలో ఆర్యసమాజ్ గోశాల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడిపాడారు.