నిజామాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాన్సువాడ పట్టణంలో రేషన్షాపు తనిఖీ పేరిట కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె… అధికారిక కార్యక్రమాన్ని కాషాయ పార్టీ ప్రోగ్రామ్గా మలచడంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదేం తీరు నిర్మలమ్మా అంటూ ప్రశ్నిస్తున్నారు.
దేశంలోని జాతీయ బ్యాంకులను, ఎల్ఐసీని, ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పగించి ఇప్పుడు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో సుద్దులు చెబుతుండడం ఏంటంటూ జనాలు అడుగుతున్నారు. ప్రజలపై ఎడాపెడా జీఎస్టీ భారాన్ని మోపి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి బతకనియ్యకుండా చేసిన ఆర్థికమంత్రి నేడు రేషన్ బియ్యం పేరుతో పేదవారి గురించి ఉచిత ప్రసంగాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పేద కుటుంబాల ఆకలిని తీరుస్తున్న సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమంటూ టీఆర్ఎస్ వర్గాలు సైతం ప్రతిఘటిస్తున్నాయి.
బీర్కూర్లోని రేషన్షాపు తనిఖీ సందర్భంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు అత్యుత్సాం ప్రదర్శించారు. పద్ధతి పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. పూర్తిగా అధికారిక కార్యక్రమంలో కాషాయ పార్టీ నేతల హడావిడిని చూసిన వారంతా మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్, సివిల్ సైప్లె అధికారుల బృందం కేంద్రమంత్రి హాజరుకాబోతున్న రేషన్షాపు తనిఖీ కార్యక్రమానికి వచ్చారు. కేంద్రమంత్రి మాత్రం ఇందుకు విరుద్ధంగా బీజేపీ మందీమార్భలంతో రేషన్ షాపు వద్దకు చేరుకున్నారు.
కాషాయ కండువాలతో రేషన్ షాపులోకి చొచ్చుకొచ్చిన వారంతా అధికారిక కార్యక్రమాన్ని ఫక్తు రాజకీయ ప్రోగ్రామ్ మాదిరిగా మార్చారు. రేషన్షాపు వద్ద ప్రజలు, అధికారులతో మాట్లాడిన సందర్భంలో బియ్యం, గోధుమలను మోదీ పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి తెలంగాణ సర్కారు చొరవతో బియ్యం పంపిణీ సాఫీగా జరుగుతున్నది. కేంద్రం నుంచి ఒక్క గోధుమ గింజ కూడా రావడం లేదు. ఉత్తరాదిలో పంపిణీ చేస్తున్న గోధుమల వ్యవహారాన్ని ఈ ప్రాంతానికి అన్వయించడంపై నిర్మలా సీతారామన్కు ఉన్న దురుద్ధేశం స్పష్టమైంది.
ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్ శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ నిర్వహిస్తున్న లోక్సభ ప్రవాస్ యోజనకు హాజరయ్యేందుకు వచ్చారు. కోటగిరి, రుద్రూర్, వర్నికి వెళ్తూ బీర్కూర్ మండల కేంద్రంలోని రేషన్ షాపు నెంబర్ 4ను తనిఖీ పేరుతో బీజేపీ శ్రేణులను వెంటేసుకొని వచ్చారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సివిల్ సైప్లె అధికారులంతా హాజరయ్యారు. బియ్యం పంపిణీ, కార్డుదారుల సంఖ్య, ఇతరత్రా వివరాలు అడిగారు.
అధికారులు బదులుగా సమాధానం ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దురుద్దేశంతో కేంద్ర మంత్రి నేరుగా రాజకీయ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. రేషన్ దుకాణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ఎందుకు పెట్టలేదంటూ కలెక్టర్ను అడిగారు. మార్గదర్శకాల మేరకు తాము వ్యవహరిస్తున్నామని కలెక్టర్ సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగకుండా మళ్లీ వచ్చి చూసే సరికి మోదీ ఫొటో లేకపోతే తానే పెడతానంటూ హుకూం జారీ చేసి బీజేపీ నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వర్ని, రుద్రూర్ మండలాలకు పయనమయ్యారు.
రేషన్కార్డు లబ్ధిదారుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానం చెప్పించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆపసోపాలు పడ్డారు. ఇందుకోసం ఏకంగా గంట పాటు రేషన్ షాపు వద్దే గడిపారు. అడిగిన ప్రశ్నలనే అడుగుతూ జనాలను అయోమయానికి గురి చేశారు. రేషన్ షాపులో సక్రమంగా బియ్యం పంపిణీ అవుతుందా అని కేంద్ర మంత్రి అడిగితే… డీలర్ ఏ పాపం చేయడు.
వచ్చింది వచ్చినట్లే సరుకులు ఇస్తాడంటూ ప్రజలు సమాధానం ఇవ్వడంతో నిర్మలా సీతారామన్ కంగుతిన్నారు. చేసేది లేక లబ్ధిదారులపైనే చిందులు వేసేందుకు ప్రయత్నించారు. డీలర్ కన్నెర్ర చేస్తుండడంతోనే మీరు ఆయనపై ప్రేమతో మాట్లాడుతున్నారనంటూ వక్ర భాష్యం చెప్పుకొచ్చారు. డీలర్ను ఏయ్… నువ్వు డీలర్వా? అంటూ కోపోద్రిక్తులవుతూ రెండు చేతులతో ఆయన్ని కేంద్రమంత్రి తోసెయ్యడం ముక్కున వేలేసుకునేలా చేసింది.