బాన్సువాడ టౌన్, ఆగస్టు 2: బాన్సువాడ నియోజకవర్గంలో శుక్రవారం తన పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అవగాహ నా రాహిత్య వ్యాఖ్యలు చేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. సభాపతి స్థానంలో కాకుండా బాన్సువాడ ఎమ్మెల్యేగా, మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లు తెలిపారు.
నిర్మలా సీతారామన్ తనకు సోదరితో సమానురాలని, ఎలాంటి రాజకీయ, వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. కేంద్ర మంత్రి స్థానంలో ఉండి అవగాహనా రాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రిగా ఆమె తన నియోజకవర్గానికి మొదటిసారి వచ్చినందుకు సంతోషించానని, కొత్తగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు లేదా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారని ఎదురుచూశానని అన్నారు. కానీ తన అంచనాలను తలకిందులు చేస్తూ అవగాహనా లోపంతో మాట్లా డి ఆమె స్థాయిని దిగజార్చుకున్నారని అన్నారు.
తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ కావాలని అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ఆమెను కలిసి వినతిపత్రాలు ఇచ్చానని, కానీ ఇప్పటివరకు ఒక్క కోల్డ్డ్ స్టోరేజ్ కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. రైతులు సొంతంగా పెట్టుబడులు పెట్టుకుని వ్యవసాయం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం మేరకు రైతుబంధు పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రతి గుంటకూ పుష్కలంగా సాగు నీరు అందేలా చేశామన్నారు. రైతులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వారు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని, ఈ విషయం తెలియని కేంద్ర మంత్రి సీతారామన్ తప్పుగా మాట్లాడారని అన్నారు. దేశంలో అతి తక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉందని, ఈ విషయం రికార్డులను చూస్తే తెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్బీమా పథకం తాము వద్దనలేదని, అందులో ఉన్న లోపాలతో ప్రజలే తిరస్కరించారని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదన్నారు. కౌలు రైతులు ప్రతి పంటకు మారుతూ ఉంటారని అందుకని రైతుకు సహాయం చేస్తున్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా పట్టదారులకే సాయం అందిస్తుందని, కౌలు రైతులకు కాదన్నారు. కాళేశ్వరం ప్రా జెక్టు ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించాలని నీతి అ యోగ్ ద్వారా సిఫారసు చేసినా ఫలితం శూన్యమన్నారు. ఒక్క రూపాయి కేటాయించలేదని తెలిపా రు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కూడా కేంద్రానిదైతే మిగతా రాష్ర్టాల్లో ఆ పథకం ఎందుకు లేదని ప్రశ్నించారు.
రైతుకు మేలు జరిగే ఎలాంటి పథకమైనా సంతోషంగా ఆహ్వానిస్తామన్నారు. అలాకాకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు హుందాతనం చూపించాలని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధంలేకుండా అందరం కలిసి రాష్ట్రం, దేశాన్ని అభివృద్ధి ప థంలో తీసుకు వెళ్లాలని అన్నారు. దేశంలో 80 శాతం మంది పేదలే ఉన్నారని వారికి సంక్షేమ పథకాలు అందించడానికి సహకరించాలని సూచించారు. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజలకు వాస్తవాలు చెప్పడం వదిలేసి విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బంది కలింగించేలా వ్యవహరించ కూడదని స్వయంగా తాను తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హెచ్చరించానని చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని తాను, ప్రజలు కోరుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు బాబా, మండల సీనియర్ నాయకులు దొడ్ల వెంకట్రాం రెడ్డి, కౌన్సిలర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.