ఖలీల్వాడి, సెప్టెంబర్ 2 : కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా పర్యటనలో చేసిన అసత్య ఆరోపణలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తిప్పికొట్టారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. 2014 వరకు ఉన్న దేశ ప్రధానులందరూ కలిసి రూ. 62 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ప్రధాని అయిన తర్వాత రూ.93 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక మంత్రిని అనే సోయి మరిచిపోయి వ్యవహరించారని విమర్శించారు.
స్థాయి దిగజారి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. రేషన్ షాపు ముందు చిల్లర రాజకీయాలు చేసి, జిల్లా కలెక్టర్ను అగౌరపరిచారని అన్నారు. నిర్మలా సీతారామన్ ఒక ఫెయిల్యూర్ ఫైనాన్స్ మినస్టర్ అని, ఇలాంటి వారు కేసీఆర్పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మోదీ వైఫల్యాలను కేసీఆర్ ఒక్కరే ప్రశ్నిస్తున్నారని అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లిష్లో మోదీ వైఖరిని ఎండగడుతున్నారని చెప్పారు. దీంతో ప్రజలు మోదీ మోసపూరిత వైఖరిపై ఆలోచన చేస్తున్నారన్నారు. అందుకు కేసీఆర్ను కట్టడి చేయాలని ఇక్కడి బీజేపీ అగ్ర నాయకత్వం, కేంద్ర మంత్రులు ప్రణాళికలో భాగంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ అంటే మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి వణుకు పుడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల అభివృద్ధికి పాటుపడకుండా కేవలం ఆరోపణలు, అసత్య ప్రచారాలకే పరిమితమవుతుందని మండిపడ్డారు. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల పర్యటనే నిదర్శనమన్నారు.
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో పెట్టలేదని కలెక్టర్ను బెదిరించి దిగజారిపోయారని ప్రజలే నవ్వుకుంటున్నారన్నారు. దేశాన్ని నడుపుతున్న అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణది నాల్గో స్థానమన్నారు. తెలంగాణ ఇచ్చే పన్నులతో బీజేపీ రాష్ర్టాల్లో అభివృద్ధికి నిధులిస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ర్టాలకు తెలంగాణ నిధులు తరలిస్తున్నారని ఆరోపించారు.
మరి అక్కడ కేసీఆర్ ఫొటో ఎందుకు పెట్టడం లేదని మంత్రి ప్రశ్నించారు. అక్కడ తెలంగాణ వాటా ఉందని, కేసీఆర్ ఫొటో పెట్టాలనే డిమాండ్ వస్తోందన్నారు. ఆయూష్మాన్ భారత్లో తెలంగాణ చేరిన విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రికి కనీస అవగాహన లేదన్నారు. గల్లీ లీడర్లా ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఒక అబద్ధాల కోరు అని మండిపడ్డారు. మాధవ్నగర్ ఆర్వోబీ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్వోబీకి మొత్తం రూ. 93 కోైట్లెతే కేంద్రం ఇచ్చిందని రూ.30 కోట్లు మాత్రమే అని, మిగతా రూ.63 కోట్లు రాష్ట్రమే ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికే ప్రాసెస్లో ఉందని పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. త న కన్న ముందు అర్వింద్ తండ్రి కూడా మం త్రిగా ఉన్నారని, మాధవ్నగర్ ఆర్వోబీ ఎందుకు కాలేదని ప్రశ్నించారు.
జిల్లా ప్రజల కష్టాల గురించి ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవితతో కలిసి వెళ్లి కేసీఆర్ను ఒప్పించి మాధవ్నగర్ ఆర్వోబీ సాధించామని వివరించారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆరోపించారు. తాను ఆర్అండ్బీ మంత్రి కాక పోయుంటే కేసీఆర్ని ఒప్పించకపోయుంటే మాధవ్నగర్ ఆర్వోబీ మంజూరయ్యేదా అని ప్రశ్నించారు.