బాన్సువాడ రూరల్/బాన్సువాడ, సెప్టెంబర్ 1 : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని దేశాయిపేట్లో ఉన్న శ్రీరాంనారాయణ్ఖేడియా (ఎస్ఆర్ఎన్కే) ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం న్యాక్ బృందం ప్రతినిధులు సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు న్యాక్ ప్రతినిధుల బృందం కళాశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించింది. వివిధ విభాగాలకు సంబంధించిన అంశాలను క్లుప్తంగా సభ్యులు పరిశీలించారు. అంతకు ముందు న్యాక్ బృందానికి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ అందించిన రిపోర్టును పరిశీలించారు. అనంతరం పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమంలో బృందం సభ్యులు పాల్గొని విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల సందర్శనకు ముందు న్యాక్ బృందం సభ్యులు సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బృందం సభ్యులను ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. న్యాక్ బృందం ప్రతినిధులు రాకేశ్ గుప్తా, డాక్టర్ ఎన్. రమేశ్, రాష్ట్ర కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ఎర్వాల కృష్ణారెడ్డి, శ్రావణ్కుమార్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.