ఖలీల్వాడి, సెప్టెంబర్ 1: అభివృద్ధిలో మన రాష్ట్రం దూసుకెళ్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వృద్ధులు నవ్వుతూ ఆనందంగా ఉండాలని పెన్షన్ రెండువేల రూపాయలకు పెంచారని తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమైక్య పాలనలో రూ.200 పెన్షన్ 22 లక్షల మందికి ఇచ్చారని, వాటికి 8 వందలకోట్లు వెచ్చించారని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 38 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నారని చెప్పారు. 16 లక్షల మంది పెరిగారన్నారు. బీడీలు, బోదకాలు, ఒంటరి మహిళలకు రూ. 2 వేల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. కొత్తగా పది లక్షల మందికి మంజూరుకాగా, మొత్తం 48 లక్షల మందికి రూ.12 వేల కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వారు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు.
కొంతమంది దొంగలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో వృద్ధులకు రూ. 750 పెన్షన్, వితంతువులకు రూ. 900, దివ్యాంగులకు రూ. 600 ఇస్తున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్లో రూ. 600, కర్ణాటకలో 600, బిహార్లో రూ. 600 పింఛన్ ఇస్తున్నారని వివరించారు. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవడమే కాకుండా ఉచిత పథకాలు ఇవ్వొద్దంటున్నారని అన్నారు.
బీజేపీ ప్రభు త్వం వస్తే మళ్లీ 600 రూపాయల పెన్షన్ ఇస్తారన్నారు. దమ్ముంటే రూ.2 వేలు ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు, రైతుబంధు ఐదు వేల నుంచి 10 వేలకు, కల్యాణలక్ష్మి లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తామని చెప్పాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆర్డీవో రవి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.