రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి మండలంలో ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నది. కాగా నిర్మల్ జిల్లాలో 18 చోట్ల ఏర్పాటు చేస్తుండగా, ఇప్పటికే 13 పూర్తయ్యాయి. వీటిలో 2.60 లక్షల మొక్కలు నాటించింది. ఆహ్లాదం పంచే పూల మొక్కలు, నీడనిచ్చే వృక్షాలతోపాటు ఆక్సిజన్ అందించే ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు మొదలుకొని యువకులు, పెద్దలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. కాగా, ఈ ఏడాది రెండో విడుతలో భాగంగా మండలానికి 4 చొప్పున72 పార్కుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది.
నిర్మల్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో 13 ప్రాంతాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. మరో ఆరు వనాల కోసం అవసరమైన స్థల సేకరణ పూర్తయిందని, త్వరలోనే ప్లాంటేషన్ పనులను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని బాసర మండల పరిధిలో ఓని, భైంసా మండల పరిధిలో ఎగ్గాం, కుభీర్ మండలంలోని జాంగాం, కుంటాల మండలంలోని మెదన్పూర్, మామడ మండలంలోని న్యూ సాంగ్వి, ముథోల్ మండలంలోని బోరిగాం గ్రామాల్లో ఈ వనాలు పూర్తయ్యాయి.
అలాగే సోన్ మండలంలోని పాక్పట్ల, తానూర్ మండలంలోని బామిని, సారంగాపూర్ మండలంలోని జెవులి, దిలావర్పూర్ మండలంలోని సముందర్పెల్లి, లోకేశ్వరం మండలంలోని గొడిసెర, నర్సాపూర్ (జి) మండలంలోని గొల్లమాడ, లక్ష్మణచాంద మండలంలోని బోరిగాం తదితర గ్రామాల్లో బృహత్ ప్రకృతి వనాలను పూర్తి చేశారు. ఈ 13 గ్రామాల వద్ద గుర్తించిన పదేసి ఎకరాల ప్రభుత్వ స్థలంలో బ్లాక్లను తయారు చేశారు. ప్రతి బీపీపీవీలో రెండెకరాలతో కూడిన నాలుగు బ్లాకులను రూపొందించి ప్రతి బ్లాక్లో ఎకరానికి 2వేల నుంచి 3వేల వరకు మొక్కలను నాటారు. ఈ విధంగా 8 ఎకరాల్లో సగటున 20 వేల మొక్కలు నాటారు.
మిగతా రెండెకరాల్లో మొక్కల బ్లాకుల మధ్య వాకింగ్ పాత్లను ఏర్పాటు చేశారు. వీటిలోనే ఆట స్థలాలకు కూడా కేటాయించారు. మీటరుకు ఒక చెట్టు ఉండేలా మొత్తం ఎనిమిది ఎకరాల్లో 20వేల అటవీ జాతి, పూలు, పండ్ల మొక్కలను నాటారు. ఇలా 13 బృహత్ ప్రకృతి వనాల్లో 2021-22లో నాటిన మొక్కల్లో ప్రస్తుతం 2లక్షల 60వేల వరకు మొక్కలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. గతేడాది నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో బీపీపీవీలు మినీ ఫారెస్టులను తలపిస్తున్నాయి. దాదాపు అన్ని వనాల్లో పూలు, పండ్ల మొక్కలు పెద్ద సంఖ్యలో నాటారు. స్థానికులు వీటిని సందర్శించి ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఈ చిట్టడవుల్లోని గ్రీనరీని ఆస్వాదిస్తున్నారు. పండ్ల మొక్కలు నాటిన బీపీపీవీల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరనుంది. త్వరలోనే చెట్ల నుంచి పండ్లను సేకరించి మార్కెట్లో విక్రయించే అవకాశం ఉంది.
అదనంగా మరో నాలుగు వనాలు..
ప్రతి మండలంలో అదనంగా మరో నాలుగు మినీ బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే చోట పదేసి ఎకరాల స్థలాన్ని సేకరించడం ఇబ్బందిగా మారడంతో అదనపు బీపీపీవీలను ఐదేసి ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు ప్రతి మండలంలో అదనంగా నాలుగు చొప్పున జిల్లాలో 72 బీపీపీవీల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారు. ఒకే చోట ఐదేసి ఎకరాల ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 27 చోట్ల స్థలాలను గుర్తించి మొక్కలను సైతం నాటారు. వీటిలో బాసర మండలం కిర్గుల్ (బి), కౌట్ల, భైంసా మండలం వటోలి, చుచుంద్, దిలావర్పూర్ మండలం కాల్వ, కడెం మండలంలో చిన్న బెల్లాల్, నచ్చన్ ఎల్లాపూర్, ఖానాపూర్ మండలంలోని బాదన్కుర్తి గ్రామాలు ఉన్నాయి.
అలాగే కుభీర్ మండలంలో బెల్గాం తండా, ధార్ కుభీర్, వర్ని, రాజోబా గుట్ట, కుంటాల మండలం దౌనెల్లి, లక్ష్మణచాంద మండలంలో నర్సాపూర్, బావాపూర్, చింతల్చాంద, లోకేశ్వరం మండలంలో రాజూర, కాండ్లి, జోహార్పూర్, లోకేశ్వరం, ముథోల్ మండలంలో రాంటెక్, చించాల, ముథోల్, నర్సాపూర్ (జి) మండలంలో రాంపూర్, నర్సాపూర్, నిర్మల్ మండలంలోని రాణాపూర్, కౌట్ల (బి) తదితర 27 గ్రామాల్లో ఈ వనాలు పూర్తయ్యాయి. మరో 45 అదనపు బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాల సేకరణ కొనసాగుతున్నది. ప్రతి అదనపు వనంలో ఎకరానికి 3వేల చొప్పున 4 ఎకరాల్లో 12వేల మొక్కలు నాటి మిగతా స్థలంలో వాకింగ్ ట్రాక్, గ్రామస్తులు సేదదీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందేకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటుతో జిల్లాలో మొత్తం బృహత్ ప్రకృతి వనాల సంఖ్య 90కి చేరుకుంటుంది. ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మొత్తం 582 పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి.
ప్రకృతిని ప్రజలకు చేరువ చేసేందుకే..
సహజ సిద్ధమైన ప్రకృతిని ప్రజలకు చేరువ చేసేందుకే ప్రభుత్వం ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ఈ వనాలు ప్రతీ మండలానికి ఎంతో అవసరం. గతంలో పల్లెలు అపరిశుభ్రంగా కళావిహీనంగా ఉండేవి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో పార్కులు ఏర్పాటు చేయడంతోపాటు, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తుండడంతో పరిశుభ్రత, పచ్చదనంతో అలరారుతున్నాయి. ఈ వనాలు ప్రజలకు మానసికోల్లాసం కలిగించడంతో పాటు, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. మిగతా వాటిని కూడా నిర్ధిష్ట వ్యవధిలో పూర్తి చేస్తాం.
– విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి