తానూర్, ఆగస్టు 30 : నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో ప్రతిష్ఠించే వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. 59 ఏళ్లుగా ఇక్కడ కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. కానీ నిమజ్జనం చేయరు. చివరి రోజు వాగు నీళ్లను చల్లి ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. తిరిగి వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. 1963కు ముందు గ్రామంలో ప్రజలు వివిధ రోగాలతో ఇబ్బందులు పడేవారు. దీంతో గ్రామంలో కర్ర గణపతిని ప్రతిష్ఠించాలని అప్పటి సర్పంచ్ గంగాధర్, రాంకిషన్ పోలీస్ పటేల్, పండితుడు సిద్ధప్ప, గ్రామస్తులతో చర్చించి నిర్ణయించారు. మహారాష్ట్రలోని పాలజ్ గణేశుడిని తయారు చేసిన కళాకారుడు పాలకొండ గుండాజీతోనే ఈ కర్ర గణపతిని తయారు చేయించారు. నాటి నుంచి నేటి వరకు ఈ గణనాథుడే విశేష పూజలందుకుంటున్నాడు. గ్రామంలో వాడవాడలా కాకుండా ఈ ఒక్కవినాయకుడినే ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తున్నది.
వరాలిచ్చే వరసిద్ధివినాయకుడు
భోసి కర్ర వినాయకుడు వరాలిచ్చే వరసిద్ధివినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. కర్ర గణేశుడిని నిమజ్జనం చేయకుండా 58 ఏళ్లుగా ప్రతిష్ఠాపన చేస్తూ వస్తున్నాం. చాలా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
-పసూల నాగనాథ్, చైర్మన్, భోసి