కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియ జోరందుకున్నది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలు ఆయా మండలాలకు చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు వచ్చిన ఈ జాబితాను మండలాలు, మున్సిపాలిటీలకు పంపించారు. లబ్ధిదారుల జాబితా ప్రకారం ప్రొసీడింగ్ కాపీలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే స్పీకర్ పోచారం పింఛన్ల పంపిణీని ప్రారంభించగా, నేటి నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ప్రొసీడింగ్లతో పాటు గుర్తింపు కార్డులు అందజేయనున్నారు. కొత్తగా మంజూరైన వారందరికీ వచ్చే నెల నుంచి పింఛన్లు అందనున్నాయి.
డిచ్పల్లి, ఆగస్టు 29: కొత్త పింఛన్ల పండుగ వచ్చింది. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల జాబితా మండలాలకు చేరింది. లబ్ధిదారులకు త్వరలో ఆర్డర్ కాపీలను అందజేయనున్నారు. జిల్లాకు మంజూరైన 48,022 పింఛన్లను కేటగిరీల వారీగా, మండలాల వారీగా విభజించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు వచ్చిన ఈ జాబితాను సంబంధిత మండలాలు, మున్సిపాలిటీలకు ఆన్లైన్లో పంపించారు. ఎంపీడీవో కార్యాలయాలకు చేరిన లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా తీసి ప్రొసీడింగ్ కాపీలు, ప్రింట్లు తీస్తున్నారు. సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్లతోపాటు లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు కూడా అందజేయనున్నారు. ఇందుకు మండల పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన కాపీలను ఆయా గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పంపిణీ చేస్తారు. కాగా పది రోజుల్లోగా ప్రొసీడింగ్ కాపీల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగానే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి ప్రశాంత్రెడ్డి కొంతమంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్ కాపీలను అందజేశారు. జిల్లాకు మంజూరైన 48,022 పింఛన్లలో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్లు 34,221 ఉన్నాయి. అత్యల్పంగా చేనేత కార్మిక పింఛన్లు 8 ఉన్నాయి. ఇదిలా ఉండగా కొత్త పింఛన్లు మంజూరయ్యాయనే విషయం తెలుసుకొని దరఖాస్తుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటికే పాతవి 2,38,733 మందికి పింఛన్లు అందుతున్నాయి. ఇందుకు ప్రతి నెలా రూ.49.94 కోట్ల బడ్జెట్ ఖర్చు అయ్యేది. ప్రస్తుతం కొత్త పింఛన్లతో కలిపి జిల్లాలో మొత్తం పింఛన్ల సంఖ్య 2,86,755కు చేరింది. ఇక నుంచి నెలకు రూ.59.84 కోట్లు ఖర్చు కానుంది. అంటే నెలకు అదనంగా రూ.9.90 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. కొత్త పింఛన్లు వచ్చిన లబ్ధిదారులు సెప్టెంబర్లో తొలిసారిగా పింఛన్ డబ్బులు పొందనున్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త పింఛన్ల జాబితాను కలెక్టర్ ఆదేశాల మేరకు మండలాలు, మున్సిపాలిటీలకు పంపించాం. పింఛన్ మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు వీలైనంత త్వరగా లబ్ధిదారులకు అందజేయాలని ఎంపీడీవోలకు సూచించాం.
-చందర్ నాయక్,డీఆర్డీవో
పేదలు, అభాగ్యుల గురించే సీఎం కేసీఆర్ ఆలోచిస్తారు. పింఛన్ల అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించడంతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది. సీఎం సార్కు రుణపడి ఉంటాం.
-ఆరేపల్లి నానయ్య
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మాకు పింఛన్లు మంజూరు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి నిర్ణయాలు ఒక్క కేసీఆర్ మాత్రమే తీసుకుంటారు. ఆయనకు మా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి.
-చితం లింగవ్వ