నిజామాబాద్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి), ఆగస్టు 29: సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 5న జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీ గౌడ్తో కలిసి సోమవారం పర్యటించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (నూతన కలెక్టరేట్) భవనం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని పరిశీలించారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో సభాస్థలిని పోలీస్ అధికారులతో పరిశీలన జరిపారు. భారీగా జనాలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యంత్రాంగానికి మంత్రి, ఎమ్మెల్యేలు సలహాలు, సూచనలు అందించారు.
అనంతరం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వేముల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సభను కనీవిని ఎరుగని తీరిలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజలంతా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రోడ్డు మార్గంలోనే సీఎం కేసీఆర్ నిజామాబాద్కు ప్రత్యేక బస్సులో చేరుకుంటారని చెప్పారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రజలకు అంకితం ఇస్తారని వివరించారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలోనే సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు వస్తారని మంత్రి వేముల వివరించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించారు. మధ్యాహ్నం 12గంటలకు ఎల్లమ్మగుట్టలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. పార్టీ నూతన కార్యాలయంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం అవుతారన్నారు.
మధ్యాహ్నం 12.30గంటలకు నేరుగా బైపాస్ రోడ్డులోని నూతన సమీకృత అధికార భవన సముదాయాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. కలెక్టర్ను నూతన చాంబర్లో స్వయంగా కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించి ఉన్నతాధికారులతో ముఖాముఖి అవుతారన్నారు. సమీకృత కలెక్టరేట్ ఎదుట గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ చేరుకుని ప్రసంగిస్తారని మంత్రి వివరించారు.
ప్రస్తుతం దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై బహిరంగ సభ వేదిక నుంచి సీఎం కేసీఆర్ కీలక ఉపన్యాసం ఇస్తారని మంత్రి వివరించారు. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి టీఆర్ఎస్కు మద్దతు తెలుపాలన్నారు.
ఎనిమిదేండ్లుగా రాష్ర్టానికి ఏమీ చేయలేని బీజేపీ తీరును ఎండగడతారని చెప్పారు. రాష్ట్రంలో అంతకు ముందు లేనివి, రానివి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు సీఎం చెబుతారన్నారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం చూపుతున్న కక్షపూరిత వైఖరి, నిధుల మంజూరులో మొండి చేయి తదితర కీలక అంశాలపై వివరిస్తారన్నారు.
సెప్టెంబర్ 5న నిర్వహించనున్న సభతో చరిత్ర లిఖించబోతున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సభతో ప్రతిపక్షాలకు గట్టి సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. ప్రజల కోసం ప్రతి నిమిషం ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ అని చెప్పారు. 2001 నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్కు నిజామాబాద్ గడ్డ ఆయువు పట్టు లాంటిదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో నిజామాబాద్ జిల్లా రూపురేఖలు సంపూర్ణంగా మారాయన్నారు. కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వమంతా కృషి చేస్తుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. టీఆర్ఎస్ పాలనలోనే నిజామాబాద్ రూపురేఖలు మారాయన్నారు. జిల్లా, మండలం, గ్రామ స్థాయి లో ప్రతి చోట అభివృద్ధి జరిగిందన్నారు. నూతన కలెక్టరేట్ను సుందరంగా నిర్మించడంతో పరిపాలన సౌలభ్యం మరింతగా విస్తరిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం బస్టాండ్ 3.5ఎకరాల్లో ఉందని.. కొత్త బస్టాండ్ కోసం ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపి ఆమోదింపజేసుకునేందుకు ఉమ్మడిగా ప్రజాప్రతినిధులమంతా కృషి చేస్తామన్నారు. రాబోయే 50 సంవత్సరాలకు ప్రజలకు అందుబాటులో మంచి బస్టాండ్ను 25 ప్లాట్ఫామ్లతో నిర్మించేందుకు ప్రయత్నిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ పక్కనే నిర్మిస్తే ప్రజలకు ఎంతో ఉపయుక్తమవుతుందన్నారు.
ప్రజలకు సుపరిపాలన
కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతోందని నిజామాబాద్ అర్బన్ ఎ మ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. కొత్త జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాకు నూతన కలెక్టరేట్ను మంజూరు చేయ డం ఈ ప్రాంత ప్రజలపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. పాత కలెక్టరేట్ పెచ్చూలూడి శిథిలావస్థకు చేరిందని చెప్పగానే నూతన కలెక్టరేట్ మంజూరుకు సీఎం ఆమోదించారని తెలిపారు. 25ఎకరాల్లో రూ.60కోట్లతో అధునాతనంగా నిర్మాణం జరిగిందన్నారు.
కొత్త కలెక్టరేట్తో నిజామాబాద్ నగరం కొంగొత్తగా కనిపిస్తోందన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.50 కోట్లతో ఐటీ హబ్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ వద్ద న్యాక్ బిల్డింగ్ రూపొందుతోందని చెప్పారు. సీఎం బహిరంగ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో నగర మేయర్ నీతూ కిరణ్, టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, పార్టీ రాష్ట్ర నాయకుడు సుజిత్ సింగ్ ఠాగూర్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై బహిరంగ సభ వేదిక నుంచి సీఎం కేసీఆర్ కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని కోరుతున్నాం.
-మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి