ఇందూరు, ఆగస్టు 29 : గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో శాంతి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై గణేశ్ మండళ్ల ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాల నిర్వాహకులు విద్యుత్శాఖకు నామమాత్రపు రుసుము చెల్లించి అధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు.
వినాయక నవరాత్రలు, శోభాయాత్ర, నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయిస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు డీసీపీ అరవింద్బాబు, డిప్యూటీ మేయర్ ఇద్రిస్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, శాంతి కమిటీ సభ్యులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించాలని కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిరివెన్నెల గ్రీన్ సొసైటీ అధ్యక్షుడు రావుట్ల జనార్దన్ ఆధ్వర్యంలో ముద్రించిన ‘పీవోపీ గణపతులు వద్దు – మట్టి గణపతులే ముద్దు’ కరపత్రాలను కలెక్టర్ సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. అందరూ బాధ్యతగా మట్టి గణపతులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు పాల్గొన్నారు.