నిజామాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 5న ఇందూరు పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్.. అదే రోజు ‘మినీ తెలంగాణ భవన్’ను ప్రారంభించనున్నారు.ఒకప్పుడు అద్దె గదుల్లో కొనసాగిన టీఆర్ఎస్కు సొంత భవనాలు నిర్మించాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా ‘మినీ తెలంగాణ భవన్’ను తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకోసం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు, నిధులు కేటాయించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎకరా విస్తీర్ణంలో పార్టీ ఆఫీస్, మీటింగ్ హాల్, కిచెన్ షెడ్డును నిర్మించారు. ప్రారంభానికి ముహూర్తం ఖరారు కావడంతో పార్టీ నాయకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.
– నిజామాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ జిల్లా కార్యాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 5న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే రోజు మినీ తెలంగాణ భవన్ను ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు సమాచారం రావడంతో పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం రోజునే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో నిర్మించిన పార్టీ భవనాన్ని మనుగడలోకి తీసుకురాబోతున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎకరం విస్తీర్ణంలో టీఆర్ఎస్ అధిష్టానం కార్యాలయాన్ని నిర్మించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ నిధులు మంజూరు చేసి ఒకే నమూనాలో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని యోచించింది. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోనూ ఇందుకు పునాది రాయి పడింది. నిజామాబాద్ పార్టీ కార్యాలయం పనులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కామారెడ్డి జిల్లాలో భవన నిర్మాణానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రూ.60లక్షల నిధులతో నిర్మిస్తున్నారు.
టీఆర్ఎస్ కార్యాలయ నమూనాను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఆమోదించారు. ఒకే రకమైన పార్టీ కార్యాలయాలనే రాష్ట్రమంతటా నిర్మిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో మినీ తెలంగాణ భవన నిర్మాణం పూర్తయ్యింది. దీని వైశాల్యం 8,352చదరపు అడుగుల్లో విస్తరించింది. ఇందులో వివిధ విభాగాలను విభజించారు. పార్టీ కార్యాలయాన్ని సెపరేటుగా నిర్మిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు విస్తీర్ణం 2,537 చదరపు అడుగులుగా ఉంది.
దీని పక్కనే మీటింగ్ హాలును నిర్మిస్తున్నారు. విశాలంగా ఉన్న సమావేశం హాలులో వందలాది మంది కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకోవచ్చు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి మీటింగ్లకు ఈ భవనం వేదికగా నిలువనున్నది. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు సమావేశ మందిరం ఉపయోగపడనున్నది. మీటింగ్ హాలు వైశాల్యం 4,712 చదరపు అడుగులుగా ఉన్నది. ఆ పక్కనే 489 చదరపు అడుగుల్లో కిచెన్ షెడ్డును నిర్మించారు. మూత్రశాలలకు 233 చదరపు అడుగులు, వాచ్మెన్ గదులకు 390 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఇవన్నీ కలుపుకొంటే సుమారు ఎకరం స్థలంలో 8352 చదరపు అడుగుల మేర నిర్మాణ స్థలం అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి నాడు నేడు కంచుకోటగా వెలుగొందుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. పార్టీ ఆవిర్భావ వేళలోనూ పాత నిజామాబాద్ జిల్లా ప్రజలు అందించిన ఉద్యమస్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఒక్కడై కదిలిన నాటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్కు నైతిక మద్దతు, రాజకీయ ప్రోత్సాహాన్ని ఇచ్చిన గడ్డ ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఖిల్లా గోడలపై రచించిన దాశరథి అక్షరస్ఫూర్తితో ఇందూరు ప్రజలంతా కేసీఆర్కు సంపూర్ణ మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన షురూ అయిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి నిలిచింది. 2001లో పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే రెండు జడ్పీ పీఠాలను కైవసం చేసుకున్న దాంట్లో నిజామాబాద్ జిల్లా ఒకటి. నాటి నుంచి నేటి వరకు క్లిష్ట పరిస్థితుల్లోనూ కేసీఆర్కు అండగా నిలిచిన ఈ ప్రాంతం అనేక సందర్భాల్లోనూ ప్రత్యేకతను చాటుకున్నది. ఒకప్పుడు కిరాయి గదుల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకున్న టీఆర్ఎస్కు నాటి కాంగ్రెస్ పాలకులు అనేక ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ కార్యకలాపాలకు ఆటంకాలు సైతం తలపెట్టారు. నేడు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా మినీ తెలంగాణ భవన్ను గులాబీ దళపతి కేసీఆర్ తీర్చిదిద్దారు.
జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు రూ.60లక్షలతో చేపట్టారు. వీటి నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. గులాబీ రంగులో మినీ తెలంగాణ భవన్ మెరిసిపోవడంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహంతో పార్టీ కార్యాలయం శోభిల్లుతోంది. పచ్చిక బయళ్లు, విశాలమైన గదులు, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక కార్యాలయం వంటి సౌకర్యాలు ఆకట్టుకుంటుండడం విశేషం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా నిర్మాణాన్ని చేపట్టారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్ మాదిరిగానే జిల్లా పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఇక కామారెడ్డి జిల్లాలోని పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సాంకేతిక కారణాలు ఎదురవ్వడంతో కాసింత జాప్యం చోటు చేసుకున్నది. మినీ తెలంగాణ భవన్కు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూర్ శివారులోని కొత్త కలెక్టరేట్ సమీపంలో సర్కారు స్థలం కేటాయించింది. ప్రస్తుతం కామారెడ్డి మన్సిపాలిటీలో విలీనమైన అడ్లూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 527లోని ఒక ఎకరం భూమిలో మినీ తెలంగాణ భవన్ నిర్మిస్తున్నారు.