ఇందూరు, ఆగస్టు 27: ఈ నెలాఖరులోగా న్యూ కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని శనివారం అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. వచ్చేనెల 5న సీఎం కేసీఆర్ న్యూ కలెక్టరేట్ను ప్రారంభించనున్న నేపథ్యంలో విస్తృత స్థాయిల్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధానంగా సుందరీకరణ, లైటింగ్ పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
న్యూ కలెక్టరేట్ ఆవరణతోపాటు కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలని, ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని ఆదేశించారు. మెయిన్ గేటు నుంచి లోనికి వచ్చే మార్గంలో మరింత అందంగా, పూల మొక్కలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రవి, వివిధ శాఖల జిల్లా అధికారులున్నారు.