జిల్లాలో పాతాళగంగమ్మ పైపైకి వస్తున్నది. వర్షాలు సమృద్ధిగా కురవడం, ఆ వర్షపు నీరు వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జలసంరక్షణ చర్యలు చేపట్టడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీటి లభ్యత పెరిగింది. దీంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూలేని విధంగా జూలై నెలలోనే అత్యధికంగా వర్షాలు కురవడంతో జలధార పైకి వస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన వర్షాలతో భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగాయి. జూన్ మాసంలో మోస్తరు వానలు కురువగా, జూలైలో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆగస్టు చివరి వరకు నిండాల్సిన వాగులు, వంకలు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండలా కనువిందు చేస్తున్నాయి. భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 6.08 మీటర్ల లోతులో నీటిమట్టం ఉంది. ఐదేండ్ల కింద 7.59 మీటర్ల లోతులో ఉన్న నీరు 1.51 మీటర్లపైకి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 81 ఫీజోమీటర్లు ఏర్పాటు చేసి గ్రౌండ్ వాటర్ లెవల్స్ను కొలుస్తున్నారు. 2018కి ముందు జిల్లా సగటు నీటి మట్టం 13.77 మీటర్ల లోతు ఉండగా సిరికొండ మండల కేంద్రంలో వాటర్ లెవల్ 24.82 మీటర్లు లోతులో ఉండేది. మూడేండ్లుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం పెరుగుతూ వస్తున్నది. 2018 నుంచి 2021 వరకు జిల్లాలో ఎగువన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ కాలువల పరిధిలో సైతం భూగర్భ జలమట్టం పెరుగుతున్నది.
రెండు పంటలకు ఢోకా లేదిక..
జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సరాసరి నీటిమట్టాలు పెరిగాయి. గతంలో సరైన వర్షాలు లేక వట్టిపోయిన బోర్లన్నీ ఇప్పుడు పోస్తున్నాయి. వదిలేసిన బోర్లలో నీరు ఉబికి వస్తుండడంతో రైతులు మోటర్లు బిగిస్తున్నారు. ఈ వానకాలంలో జిల్లాలోని అన్నిమండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. అయితే ప్రస్తుత వానకాలం సీజన్తోపాటు యాసంగి పంటలకు కూడా ఢోకా లేకుండా పోయింది. ఇప్పుడు కురిసిన వర్షాలతో వచ్చే రెండు, మూడేండ్లదాకా నీళ్ల ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు.
రికార్డు స్థాయి వర్షం..
ఈ వానకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. రెండు నెలల ముందుగానే ఏడాది సగటు వర్షపాతం నమోదైంది. ఏడాది మొత్తం కురవాల్సిన వర్షం 15 రోజుల్లోనే కురిసింది. వానకాలం ప్రారంభంలో కొంత ఆలస్యంగా వర్షాలు కురిసినా జిల్లాలో ఈ నెల 9వతేది నుంచి పడిన వానలతో రికార్డు వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జిల్లా సరాసరి వర్షపాతం 1042.4 మిల్లీమీటర్లుగా ఉంది. కానీ జూలై ముగిసే వరకు 1098.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై 25 వరకు 398.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 1051.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నవీపేట్ మండలంలో 278.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 29 మండలాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో ప్రధానమైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరాయి. వరద నీరు విడుదలతో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రామడుగు, కళ్యాణి, పోచారం ప్రాజెక్టులు వరదనీటితో నిండిపోయి జలకళను సంతరించుకున్నాయి.
చెక్డ్యాములతో సత్ఫలితాలు..
జలసంరక్షణతోపాటు భూగర్భజలమట్టం పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాములు సత్ఫలితాలిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వాగుల్లో నిర్మించిన చెక్డ్యాముల మూలంగా వరద ప్రవాహం నిలిచింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులన్నీ పొంగిపొర్లాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో చెక్డ్యాములు నిర్మించిన ప్రాంతాల నుంచి సుమారు 2 నుంచి మూడు కిలోమీటర్ల మేర జలాలు కనిపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల బోర్లన్నీ ఫుల్గా పోస్తున్నాయి. పలుచోట్ల బోరుబావిలో మోటర్లు పెట్టకున్నా ఉబికి వస్తుండడం విశేషం.
మరో రెండు నెలలు వర్షాలు..
ఏటా వానకాలం ఆరంభంలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన వర్షాలతో భూగర్భజలమట్టం పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరం జూలై రెండో వారంలోనే అల్పపీడనద్రోణితో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ చివరి వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నది. దీంతో రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో భూగర్భజలమట్టం పెరుగుతుందని భూగర్భజలవనరుల శాఖ అంచనా వేస్తున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూగర్భజలాలు వృద్ధి చెందుతున్నాయి. జిల్లాలో ఈసారి 1.51 మీటర్ల నీటిమట్టం పెరిగింది. మరో రెండు నెలలు సాధారణ వర్షపాతం కురిసినా నీటిమట్టం మరింత పెరుగనున్నది.