నిజామాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :నిజామాబాద్కు చెందిన కిరణ్ ఐటీ ఉద్యోగి. పదేండ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయంలో సొంతూరుకు వచ్చి ఓటేస్తాడు. లేదంటే విలువ ఉండదేమోననే ఆందోళన.. అయితే కిరణ్ గత హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లోనూ ఓటు వేశాడు. ఇలా చాలామందికి వేర్వేరు చోట్ల ఓటరు కార్డులు ఉన్నాయి. దీంతో జనాభాకు మించి ఓటర్ల సంఖ్య ఉంటున్నది.
డబుల్ ఓట్లను పూర్తిగా తొలగించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఓటరు కార్డులకు ఆధార్తో అనుసంధానం చేసి ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న ఓట్లను తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఓటుహక్కు విషయంలో నెలకొన్న ఈ గందరగోళాన్ని పూర్తిగా తొలగించి పారదర్శకంగా జాబితాను రూపొందించేందుకు ఈసీ సన్నద్ధమవ్వగా, ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఎన్నికల అధికారులు(కలెక్టర్లు) ఆధార్ లింకింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
స్వచ్ఛందంగా ఆధార్ సీడింగ్…
దేశంలో అన్నింటికీ ఆధార్ ప్రధాన గుర్తింపు కార్డుగా మారింది. దీంతో వ్యక్తిగత సమాచార గోప్యతపై సవాలక్ష ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్ వివరాలను అందజేస్తే ఇతర వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందనే విషయంపై సుప్రీంకోర్టులో అనేక కేసులు నడిచాయి. చివరగా సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు భారత ఎన్నికల సంఘం ఆధార్ అనుసంధానం ప్రక్రియపై ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని 2019లోనే తెరపైకి తెచ్చినప్పటికీ వివిధ కారణాలతో అమలులో జాప్యం జరిగింది. కొత్తగా ఓటు హక్కు కోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఫారం-6ఏను బీఎల్వోలు పూరించి ఆధార్ వివరాలను జత చేయనున్నారు. ఈ విషయంలో ఎక్కడా ఓటర్లపై ఒత్తిడి తేవొద్దని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇది పూర్తిగా ఓటర్ల ఇష్టపూర్వకమేనని చెబుతున్నారు. మొబైల్ ఫోన్లలోనూ అనుసంధానం చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలను సవరిస్తున్నారు. ఏటా సాధారణ సవరణ ప్రక్రియ నిర్వహిస్తున్నా బోగస్ ఓట్లు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ఇప్పటికీ మృతుల పేర్లు జాబితాలో కనిపిస్తున్నాయి. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి డబుల్ ఓట్లు ఉన్నవారిని గుర్తించి తొలగిస్తున్నప్పటికీ నియంత్రణ సాధ్యం కావడంలేదు. దీంతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఇంటి పేరు, ఫొటోల ఆధారంగా ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కలిగిఉన్నవారిని గుర్తించారు. వాటి ఆధారంగా ఇంటికి వెళ్లి నోటీసులు అందిస్తూ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 1న ప్రారంభమైన ఆధార్ సీడింగ్ ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగనుంది.
బోగస్ ఓట్లకు చెక్..
ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేస్తే బోగస్ ఓట్లను అరికట్టవచ్చని ఎన్నికల సంఘం చాలా కాలంగా చెబుతున్నది. ఇది అమలైతే ఒకేచోట ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. చాలామంది వలస కార్మికులకు సొంత గ్రామంతోపాటు వారు పనిచేసే పట్టణాలు, నగరాల్లోనూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఓటరు కార్డును ఆధార్తో అనుసంధానం చేస్తే ఒక చోటనే ఓటుహక్కు ఉంటుంది. దీంతోపాటు బోగస్ ఓట్లకు సైతం చెక్ పడనుంది.
ఉమ్మడి జిల్లాలో 19లక్షల 43వేల 154 ఓటర్లు
ప్రస్తుతం ఓటరు తుది జాబితాను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. గతేడాది వెల్లడించిన ముసాయిదా జాబితా ప్రకారం ఫిర్యాదుల ద్వారా వచ్చిన మార్పులు, చేర్పుల అనంతరం కచ్చితమైన ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. ఈసీ గణాంకాల ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువ ఓటర్లు 13వేల మంది ఉన్నారు. వీరికి తొలిసారిగా ఓటుహక్కు కల్పించబడింది. మొత్తం 19 లక్షల 43వేల 154 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికం. పురుషులు 9లక్షల 29వేల 332 మంది, మహిళా ఓటర్లు 10లక్షల 13వేల 739 మంది ఉన్నట్లుగా తేలింది. ఉభయ జిల్లాల్లోనూ ఈసారి థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య కొంత పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో 31 మంది, కామారెడ్డిలో వీరి సంఖ్య 52 ఉన్నది.
మహిళా ఓటర్లే అధికం..
నిజామాబాద్ జిల్లాలో 1509 పోలింగ్ స్టేషన్లను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో మొత్తం 13లక్షల 15వేల 26 మంది ఓటర్లు ఉన్నారు. ఫామ్-6, 6ఏ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు 13,632 మంది ఉన్నారు. ఫామ్-7 ప్రకారం డబుల్ ఓట్లను తొలగించేందుకు దరఖాస్తు చేసుకున్న వారు 13,199 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో పురుషులు 6లక్షల 23వేల 471 మంది, మహిళలు 6లక్షల 91వేల 524 మంది ఉన్నారు. థర్డ్ జెండర్లు 31 మందికి ఓటుహక్కు కల్పించారు. కామారెడ్డి జిల్లాలో 790 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 6లక్షల 28వేల 128. ఫామ్- 6, 6ఏ ప్రకారం 6,060 మంది వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కును బదిలీ చేయించుకున్నారు. ఫామ్-7 ప్రకారం 2,585 మంది అదనంగా ఉన్న ఓటుహక్కును తొలగించుకున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్లలో పురుషులు 3లక్షల 5వేల 861 మంది, స్త్రీలు 3లక్షల 22వేల 215 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ పరిధిలో 52 మందికి ఓటుహక్కు ఉంది. ఉభయ జిల్లాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య ఈసారి పెరిగినట్లుగా ఎన్నికల అధికారులు చెబుతున్నారు.