బీర్కూర్, ఆగస్టు 19 :రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నది. అందుకు తగినట్లుగా భారీగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులను కల్పిస్తున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేటు దవాఖానల్లో సిజేరియన్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో సుఖ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. దీనికి తోడు గర్భిణులు, బాలింతలు బలంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం మాదిరిగానే గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ పథకానికి శ్రీకారం చుట్టింది.
16 వేల మంది గర్భిణులకు..
రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ముందుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో కామారెడ్డి జిల్లాను సైతం ఎంపిక చేశారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందుతుండగా ప్రస్తుతం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెడుతుండడంతో గర్భిణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గర్భిణుల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాల లోపంతో సిజేరియన్లు అధికమవ్వడంతోపాటు మాతా శిశుమరణాలు పెరిగే ఆస్కారం ఉంటుంది. మాతా శిశు మరణాలను నివారించేందుకు న్యూట్రిషన్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కిట్లతో గర్భిణులకు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది మహిళలు లబ్ధిపొందనున్నారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 16 వేల మంది గర్భిణులు ఈ కిట్ అందుకోనున్నారు. ఈ కిట్ను ప్రభుత్వం రెండుసార్లు అందజేయనున్నది. మొదటగా మూడు నెలల గర్భిణులకు రూ.2 వేల విలువ చేసే న్యూట్రిషన్ కిట్ను అందజేస్తారు. అనంతరం ఆరు నెలల సమయంలో మరో రూ.2 వేల విలువ చేసే కిట్ను అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని రానున్న బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు.
కేసీఆర్కు నిండు ఆశీర్వాదాలు..
గర్భిణుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నూత న పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయనకు మా నిండు ఆశీర్వాదాలు ఉంటాయి. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వర కు చూడలేదని మా పెద్దలు అంటుంటే మేమెంతో అదృష్టవంతులమని సంబురంగా ఉంది. మా ఆరోగ్యం కోసం కోట్లు ఖర్చు పెట్టి న్యూట్రిషన్ కిట్ అందిస్తున్న సీఎం సల్లగా ఉండాలి.
-సుప్రియ, గర్భిణి, నస్రుల్లాబాద్
సీఎంను దైవంగా భావించాలి
సీఎం కేసీఆర్ను గర్భిణులు దైవంగా భావించాలి. మొదట బాలింతల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్తో ఎంతో మంది సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టి బతుకమ్మ పండుగకు అందించనున్నారు. మహిళల కోసం ఇంతగా ఆలోచిస్తున్న కేసీఆర్కు మా ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి.
-సవిత, గర్భిణి, నస్రుల్లాబాద్
మాతా శిశు మరణాలు తగ్గుతాయి..
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పడతాయి. ఇప్పటికే కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో మహిళలకు ఎంతో రక్షణ అందిస్తున్న ప్రభుత్వం మరొక బృహత్తర పథకానికి నాంది పలకడం ఒక మహిళగా సంతోషంగా ఉంది.
-విజయలక్ష్మి, మెడికల్ ఆఫీసర్, పీహెచ్సీ, బీర్కూర్
హిట్ కొట్టిన కేసీఆర్ కిట్..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయిన వారికి కేసీఆర్ కిట్ను అందించడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కుమారుడు జన్మిస్తే రూ.12 వేలు, కుమార్తె జన్మిస్తే రూ.13 వేలను ప్రభుత్వం కేసీఆర్ కిట్ ద్వారా అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అమ్మఒడి పథకం గర్భిణులకు వరంగా మారింది. గతంలో గర్భిణులకు నెలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఇప్పుడు వారానికి ఒకసారి తప్పకుండా నిర్వహిస్తున్నారు.
అమ్మకు వరం న్యూట్రిషన్ కిట్కేసీఆర్ కిట్ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని రానున్న బతుకమ్మ పండుగకు ప్రారంభించి మహిళలకు ప్రభుత్వం కానుకగా అందించనున్నది. గర్భిణులకు పోషకాహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాల లోపంతో మాతా శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండడంతో వాటిని అధిగ మించేలా న్యూట్రిషన్ కిట్లను అందించి గర్భిణులకు ఆదుకోవాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.