నిజామాబాద్ స్పోర్ట్స్/ ఇందల్వాయి/ భీమ్గల్/రెంజల్, ఆగస్టు 18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో యువకులు, క్రీడాకారులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.
నగరంలోని డీఎస్ఏ మైదానంలో కొనసాగుతున్న ఫ్రీడమ్ కప్ పోటీలు గురువారంతో ముగిశాయి.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజుతో పాటు అధికారులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు. కలెక్టర్ వర్సెస్ పోలీసు కమిషనర్ జట్ల టగ్ ఆఫ్ వార్ రసవత్తరంగా సాగింది. కలెక్టర్, సీపీ తమ జట్లకు నేతృత్వం వహిస్తూ గెలుపు కోసం పోరాడారు. పోటీలో పోలీస్ కమిషనర్ జట్టు విజయం సాధించింది. వాలీబాల్ తదితర పోటీల్లోనూ ఆయా జట్లు పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు కలెక్టర్, సీపీలతో కలిసి క్రీడాకారులను ఉదయం పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. క్రీడా పోటీలు ముగిసిన అనంతరం గెలుపొందిన జట్లకు కప్లను ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాణిరుద్రమదేవి, ఝాన్సీరాణి, ఉదంసింగ్, సైనికుల వేషధారణల్లో వివిధ పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించి, త్రివర్ణ పతాకాలతో భారతదేశ ఆకారంలో కూర్చున్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, గిరిరాజ్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మైదానాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రి వేళ అరగంట పాటు ఆయా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని పటాకుల కాల్చి సందడి చేశారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వివిధ శాఖల ఉద్యోగులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఉత్సాహంగా, సంతోషంగా వివిధ ఆటలను ఆడారు.
భీమ్గల్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వాలీబాల్, కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎంఈవో స్వామి తెలిపారు. కబడ్డీ బాలికల విభాగంలో కేజీబీవీ భీమ్గల్ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో కృషి పాఠశాల నిలిచినట్లు తెలిపారు. వాలీబాల్లో జడ్పీహెచ్ఎస్ పల్లికొండ ప్రథమ, సరస్వతీ విద్యామందిర్ ద్వితీయ స్థానంలో, బాలుర వాలీబాల్లో ప్రథమ స్థానంలో జడ్పీహెచ్ఎస్ పల్లికొండ, ద్వితీయ స్థానంలో జడ్పీహెచ్ఎస్ బడాభీమ్గల్ పాఠశాలలు నిలిచిచాయి. కార్యక్రమంలో ఎంపీపీ మహేశ్, మున్సిపల్ కౌన్సిలర్ సతీశ్గౌడ్ పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి పోటీలను సర్పంచ్ రమేశ్కుమార్ ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈవో గణేశ్రావు తెలిపారు.
ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న మండల స్థాయి ఖోఖో పోటీలు గురువారంతో ముగిశాయి. ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నిజామాబాద్ నగరంలో శుక్రవారం నుంచి నిర్వహించే ఖోఖో పోటీల్లో పాల్గొంటారని మండల వ్యాయామ ఉపాధ్యాయుడు చిన్నయ్య తెలిపారు.