బోధన్, ఆగస్టు 15 : దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుకుందామని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన వేడుక(సెంట్రల్ ఫంక్షన్)లను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే షకీల్ ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతీశరత్రెడ్డి తదితరులు విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్ల నుంచి గౌరవందనం స్వీకరించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భారీ కేక్ను కట్చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్ ప్రసంగించగా, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రగతి నివేదికను చదివారు.
ఎమ్మెల్యే షకీల్ ప్రసంగించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులకు బుద్ధి చెప్పాలన్నారు. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిందని, ఆ మహనీయుల ఆశయాలను కొనసాగిస్తామని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు. బోధన్ నియోజకవర్గంలో గత అరవైఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఎనిమిదేండ్లలో జరిగిందన్నారు.
అనంతరం పట్టణంలోని ప్రభుత్వ గురుకుల, కస్తూర్భా పాఠశాలలు, ప్రైవేట్ విద్యాలయాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వీఆర్ దేశాయ్, ఎంపీపీ బుద్దె సావిత్రీరాజేశ్వర్, జడ్పీటీసీ లక్ష్మీగిర్దావర్ గంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహెల్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, తహసీల్దార్ వరప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, రైతుబంధు సమితి బోధన్ మండల మాజీ కో-ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ బోధన్ పట్టణ, మండల అధ్యక్షులు రవీందర్యాదవ్, గోగినేని నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు ఎంఏ రజాక్, తూము శరత్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, బోధన వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.