మాక్లూర్, ఆగస్టు 12 : నేటి తరం యువత కాలానుగుణంగా వస్తున్న మార్పులను అనుసరిస్తూ వారి ఆధునిక పోకడలకు అలవాటు పడుతూ సాఫ్ట్వేర్ రంగం వైపు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ గ్రామ యువకులు డిగ్రీలు, పీజీలు చదివి ఏసీ గదుల్లో ఉద్యోగం పొందాలని ఆశ పడలేదు. దేశ సేవ కోసం ఏకంగా ఓ గ్రామం నుంచి 21 మంది యువకులు నడుం బిగించారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన యువకులు సైన్యంలో చేరి దేశానికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరందరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. గ్రామం నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 21మంది యువకులు 19-20 ఏండ్ల వయస్సులోనే సైనికులుగా ఎంపికై ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) విభాగాల్లో పనిచేస్తూ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాక తల్లితండ్రుల కలలను సాకారం చేశారు. గ్రామానికి చెందిన వారు తమ పిల్లలను దేశ సేవ చేయడానికి ప్రోత్సహించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని సైన్యంలో చేరడానికి మరింత మంది యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామం నుంచి మొదటి జవాన్గా బి.చంద్రశేఖర్ 2001లో సైన్యంలో ఉద్యోగాన్ని సాధించారు. ఈయనను స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని యువకులు సైన్యంలో చేరడానికి కావాల్సిన అర్హతలు సాధించడానికి ప్రతిరోజూ శారీరకంగా శ్రమిస్తున్నారు. సైన్యంలో చేరడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు గ్రామానికి చెందిన 21 మంది యువకులు ఆర్మీలో చేరారు. పుట్టిన ఊరికి పేరు తేవడంతో పాటు దేశానికి సేవ చేయడంలో ఉన్న ఆనందానికి మించినది మరొకటి లేదని సగర్వంగా చెబుతుంటారు అడవి మామిడిపల్లికి చెందిన ఆర్మీ జవాన్లు.
మా గ్రామస్తులే నాకు స్ఫూర్తి
2016లో ఆర్మీలో చేరాను. ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాను. చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరిక ఉండేది. తల్లిదండ్రులు సైతం సైన్యం చేరతానంటే అడ్డు చెప్పలేదు. గ్రామంలో అప్పటికే సైన్యంలో చేరిన వారిని చూసి స్ఫూర్తి పొందాను.
-రాజేశ్, జవాన్
ఆర్మీలో చేరిన మొదటి వ్యక్తిని నేనే..
మా గ్రామం నుంచి ఆర్మీలో చేరిన మొదటి వ్యక్తిని నను. 2001లో చేరగా నేటి వరకు నన్ను స్ఫూర్తిగా తీసుకొని 21 మంది యువకులు ర్మీలో చేరి దేశ సేవ చేయడం చాలా గర్వంగా ఉంది. మహారాష్ట్రలోని నాసిక్లో ట్రైనింగ్ అనంతరం కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ర్టాల్లో 17 ఏండ్ల పాటు దేశానికి సేవలు అందించి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీ కార్యదర్శులను నియమించడంలో అందులో ఉద్యోగం సాధించాను.
-చంద్రశేఖర్, రిటైర్డు ఆర్మీ హవాల్దార్.
చంద్రశేఖర్ నాకు స్ఫూర్తి
మా ఊరి నుంచి మొదటిసారి 2001లో చంద్రశేఖర్ ఆర్మీలోకి వెళ్ళాడు. ఆయన స్పూర్తితో నేను సైతం దేశసేవ చేసేందుకు 2004లో ఆర్మీలో చేరాను. జమ్ము,కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లో జవాన్గా, హవల్దార్గా పనిచేశాను. 17 ఏండ్లు సర్వీసు పూర్తి చేసుకొని 2021లో వచ్చాను. ప్రస్తుతం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాను.
-మావూరి రవీందర్, మాజీ జవాన్
కశ్మీర్లో పరిస్థితులు మారాయి..
2011లో ఆర్మీలో చేరాను. పంజాబ్, ఆస్సాం, యూపీ, కశ్మీర్లో విధులు నిర్వహించాను. ప్రస్తుతం కశ్మీర్ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జవాన్లకు ఇబ్బందులు తొలగాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో మూడు నెలల వరకు మాకు ప్రపంచంతో సంబంధం లేకుండా విధులు నిర్వహించాం. మా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడిని. అయినప్పటికీ నన్ను సైన్యంలో చేరడానికి ప్రోత్సహించారు.
-సంగెం అనిల్, హవల్దార్
రోజు టెన్షన్గా ఉంటుంది..
మా కుమారుడు రాజేశ్ 2016లో ఆర్మీలోకి వెళ్లాడు. రోజూ ఫోన్ చేసే వరకు టెన్షన్గా ఉంటుంది. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆర్మీలోకి ఒక్కగానొక్క కుమారుడిని పంపాలంటే భయమేసింది. పట్టుబట్టి ఆర్మీలోకి వెళ్లాడు. చిన్ననాటి నుంచి ఆర్మీలో చేరుతానని అనేవాడు. దేశానికి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది.
-రాణి, జవాన్ రాజేశ్ తల్లి