నిజామాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంద్రాగస్టుకు కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాల్లో జోష్ కనిపిస్తోంది. కొంత కాలంగా దరఖాస్తులు చేసుకుని ఆశగా ఎదురు చూస్తున్న వారిలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన సంతోషాన్ని నింపింది. పింఛన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించారు. వీరందరికీ మంజూరు ప్రక్రియలో కాసింత జాప్యం జరిగింది. 2020 ప్రారంభం నుంచి కరోనా రూపంలో ఆర్థిక విపత్తు వెంటాడడం తో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొని నిలిచింది. మధ్యలో కేంద్ర సర్కారు సైతం పేదల ప్రజల పొట్ట కొడుతూ నిధుల కటకటను సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ పైశాచికంగా ఆనందిస్తోంది. ఇంతటి విపత్కర సమయంలో సీఎం కేసీఆర్ మాత్రం మొక్కవోని ధైర్యం తో ప్రజల కోసం నిలబడి తానిచ్చిన మాటను నెరవేరుస్తున్నారు. ఈ మధ్యనే ఘనత వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఉచిత పథకాలు రద్దు చేయాలంటూ ప్రకటన చేసినప్పటికీ సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో అర్హులైన వారందరికీ పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. పేదోళ్లకు పెద్దన్నలా నిలిచి కేసీఆర్ మరోసారి పెద్ద మనసును చాటుకుంటున్నారు.
నిజామాబాద్లో
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2లక్షల 39వేల 162 మందికి పింఛన్లు నెలవారీగా పంపిణీ జరుగుతున్నది. ఇందులో వికలాంగులకు రూ.3,016, మిగిలిన వారందరికీ రూ.2,016 చొప్పున ఆర్థిక సాయం అందుతున్నది. ప్రతినెలా పింఛన్ల పంపిణీ కోసం నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం రూ.50.03 కోట్లు. అత్యధికంగా బీడీ కార్మికులు 95,587 మందికి రూ.19.27 కోట్లు, 67, 476 మందికి వితంతు పింఛన్లకు రూ.13.60 కో ట్లు, వృద్ధాప్య పింఛన్లు 45, 253 మందికి రూ.9.12 కోట్లు చెల్లిస్తున్నారు. 18,199 మంది వికలాంగులకు రూ.3,016 చొప్పున రూ.5.49 కోట్ల పంపిణీ జరుగుతున్నది. చేనేత కార్మికులు 190 మందికి రూ.4లక్షలు, గీత కార్మికులు 962 మందికి రూ.19లక్షలు, ఒంటరి మహిళలకు జీవన భృతి కింది 9,721 మందికి రూ.1.96కోట్లు మంజూరు అవుతున్నాయి. ఎయిడ్స్, పైలేరియా వ్యాధిగ్రస్తులు 1774 మందికి రూ.36 లక్షలు అందుతున్నది. పైరవీలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరుగుతున్నది. మధ్యలో బ్రోకర్లు, మధ్యవర్తుల పాత్రకు చరమగీతం పాడుతూ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకే పింఛన్ అందిస్తోంది.
ఎవరెవరికి పింఛన్లు…?
వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట కలిగించేలా ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది. ఇది వరకు 65 ఏండ్లు నిండిన వారికే వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేది. ఆ వయస్సును 57 ఏండ్లకు కుదిస్తూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్నది. 57 ఏండ్లు నిండిన వారంతా వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు అర్హులుగా పరిగణించనున్నారు. సంబంధీకులు ఇప్పటికే మీసేవ కేంద్రాల్లో ఆధారాలతో దరఖాస్తులు చేశారు. వయసు నిర్ధారణకు పంచాయతీ, మున్సిపల్ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు లేదా గతంలో చదివిన విద్యా సంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు లేదంటే ఓటరు గుర్తింపు కార్డుల్లో నమోదైన వయస్సును ఆధారంగా చూపించారు. దరఖాస్తుకు ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ పత్రంతో పాటు బ్యాంక్ పాసు బుక్, పాస్ పోర్టు సైజ్ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారుడే వేలి ముద్ర ద్వారా దరఖాస్తు సమర్పించారు.
కొత్త దరఖాస్తులు ఇవీ..
భోజనం, మందులు, ఇతర చిన్నచిన్న అవసరాల నిమిత్తం ఎదుటి వారి సాయం కోసం ఎదురు చూసే ఎంతో మంది వృద్ధులు ఇప్పుడు సీఎం కేసీఆర్ను తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్గా గత ప్రభుత్వాలు రూ.200 మాత్రమే ఇవ్వగా దానిని టీఆర్ఎస్ సర్కారు రూ.2,016కు పెంచింది. దివ్యాంగులకు మానవతా దృక్పథంతో ఏకంగా నెలకు రూ.3,016 చొప్పున సర్కారు అందిస్తున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీ పట్టాలెక్కి పరుగులు తీస్తున్నది. పింఛన్ డబుల్ చేస్తామని చెప్పి వెంటనే అమలు చేశారు. ప్రస్తుతం కుదించిన పింఛన్ అర్హత వయస్సును స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా అమలు చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కుదించిన వయసు రీత్యా భారీగానే దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో జూలై 2019 నుంచి జూన్ 2022 వరకు 16,938 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ఇందులో వృద్ధాప్య 3,523, వితంతు 9,628, వికలాంగులు 2,075, చేనేత కార్మికులు 8, ఒంటరి మహిళలు 7,94, గీత కార్మికులు 221, బీడీ కార్మికులు 689 దరఖాస్తులున్నాయి.
జాబితా సిద్ధంగా ఉంది…
నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 2లక్షల 39వేల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఠంచనుగా నెల వారీగా బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వమే పింఛన్ డబ్బులు జమ చేస్తున్నది. తగ్గించిన అర్హత వయస్సు మేరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాం. తదుపరి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– చందర్ నాయక్, నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి