బీర్కూర్, ఆగస్టు 12: మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, వారికి వ్యతిరేకంగా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తే సహించేదిలేదని సంబంధిత అధికారులపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పేదల కోసం పనిచేయడంలేదని, కేవలం కాంట్రాక్టర్లు చెప్పుడు మాటలు విని కండ్లు మూసుకొని కాగితాలపై సంతకాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో మత్స్యశాఖాధికారులు, మత్స్యసహకార సంఘా ల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.చెరువుల్లో వేసేందుకు ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలను ఇస్తుంటే.. అధికారులు కనీసం పర్యవేక్షణ కూడా చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చెరువుల్లో వేసే చేపల సైజు 80 నుంచి 100 మిల్లీ మీటర్లు ఉండాలని తెలిసినా కేవలం 30 నుంచి 40 మిల్లీమీటర్ల చేపలను బలవంతంగా వేసినా ఊరుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
చెరువుల్లో చేప పిల్లలను వేస్తే రికార్డుల్లో రాయరా ? అని ప్రశ్నించారు. రాస్తే రికార్డులు ఎక్కడున్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ తతంగం తెలిసే సమీక్షా సమావేశం ఏర్పాటు చేశానని, మిమ్మల్ని నమ్ముకుంటే నన్ను నట్టేటా ముంచారు..’ అని మండిపడ్డారు. ఈ విషయం మత్స్యకారులకు కూడా తెలియాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సారి చేపపిల్లలు వస్తే 80 నుంచి 100 మిల్లీమీటర్లకు తక్కువ కాకుండా ఉండాలని, మత్స్యకారులకు నచ్చిన చేపలుంటేనే చెరువుల్లో వేసుకోవాలని సూచించారు. లేదంటే వాపస్ పంపించాలని, ఆ విషయం తాను చూసుకుంటానని మత్య్సకారులకు భరోసా ఇచ్చారు. లక్ష చేపలు తెచ్చారని చెబితే కచ్చితంగా లెక్కించాలని సూచించారు. కల్కి చెరువులో లక్ష చేపలు, పోచారం చెరువులో 30 వేల చేపపిల్లలు వేయాల్సి ఉండగా 10 వేల చేపపిల్లలు వేసి 40 వేలు వేసినట్లుగా రాసుకుంటే ఏం చేస్తున్నారని అధికారులను హెచ్చరించారు.
ఏ రకమైన చేపలు అవసరమో వాటినే వేసుకోవాలని, దొంగ చేపలు, బోగస్ చేపలను వేసుకోవద్దని మత్స్యకారులకు సూచించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మత్స్యకారులను మోసం చేస్తానంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. గతంలో మాదిరిగా మోసం చేస్తాం, దొంగ లెక్కలు రాస్తానంటే ఊరుకోనన్నారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటున్నారనే ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డిలో సమావేశం నిర్వహించినా అధికారుల్లో స్పందన లేదన్నారు. మత్స్యకారులు కూడా ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు. మత్స్యకారులకు ఆటోలు, ద్విచక్ర వాహనాలను అందజేసింది వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే అని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, గురువినయ్ కుమార్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఫిషరీస్ అధికారి వెంకటేశ్వర్రావు, రాజ నర్సయ్య, లాయక్ మొహినుద్దీన్, నిజాంసాగర్ ఫిషరీస్ అధికారి డోలీసింగ్, అధికారులు, మత్య్స సహకార సంఘం నాయకులు పాల్గొన్నారు.