కుటుంబాలను వదిలేసి.. ప్రాణాలను లెక్కచేయకుండా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తారు సైనికులు. శత్రువు కనిపిస్తే చాలు.. వెంటాడి వేటాడే తెగువ వారిది. గడ్డ కట్టే చలిలో.. మంచు కొండల మధ్య జవాన్లు కాపలాకాయడం అత్యంత క్లిష్టమైన పని. దేశ రక్షణలో జన్మధన్యం చేసుకుంటున్నారు ఈ ప్రాంత యువకులు. మాతృభూమి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిగా తీసుకొని ఒకే ప్రాంతం నుంచి 28మందికి పైగా సైన్యంలో విధు లు నిర్వరిస్తుండడం విశేషం.వీరంతా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చీమన్పల్లి, తాటిపల్లి, పందిమడుగు గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం.
– సిరికొండ, ఆగస్టు 11
గర్వంగా ఉంది..
దేశం కోసం పని చేస్తుండడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నాలుగేండ్లుగా ఆర్మీలో పని చేస్తున్నా. దేశ రక్షణ కన్నా మాకు ఏదీ ఎక్కువ కాదు. మా ఊరిలో అందరూ ఆర్మీకి వెళ్తుంటే నేను కూడా చేరి దేశం కోసం పని చేయాలనుకున్నా. చాలా కష్టపడి ఆర్మీలో ఉదోగ్యం సాధించా. ప్రస్తుతం శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న.
-కోన శ్రీకాంత్, ఆర్మీ ఉద్యోగి, చీమన్పల్లి
అమ్మానాన్న కల నెరవేర్చిన..
నేను సైన్యంలో పనిచేయాలనేది మా అమ్మానాన్న కోరిక. వారి కల నెరవేర్చేందుకు ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సాధించాను. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆర్మీలో ఉద్యోగం సాధించినందుకు సంతోషంగా ఉంది.
-సంకోజీ వెంకటేశ్, ఆర్మీ ఉద్యోగి, చీమన్పల్లి
కల నెరవేరింది..
మాది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ పూర్తి చేశాను. నాకు ఆర్మీలో చేరాలనే కల. ఎలాగైనా ఆర్మీలో చేరాలనే కృషితో మా ఊరివాళ్లను ఆదర్శంగా తీసుకున్నాను. ప్రస్తుతం ఆర్మీలో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాను.
-నక్క రజినీకాంత్, ఆర్మీ ఉద్యోగి, చీమన్పల్లి
కల సాకారం చేసుకున్నా..
నేను మా ఊరిలోనే చదువుకున్నాను. సైన్యంలో చేరాలన్న కల నెరవేరింది. పది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాను. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం లడక్లో జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నా. దేశానికి సేవచేసే భాగ్యం దొరికినందుకు సంతోషంగా ఉంది.
-మిల్క్ మహేశ్, ఆర్మీ ఉద్యోగి,చీమన్పల్లి