ఖలీల్వాడి, ఆగస్టు 9:స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, ఎంపీ సురేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వి. గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు తదితరులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. త్రివర్ణ పతాకపు రంగుల్లో ఉండే బెలూన్లను ఎగురవేశారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని 75ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేలా వజ్రోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమన్నారు.
మహనీయుల వీరోచిత పోరాటం, వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా మహనీయుల స్ఫూర్తి నేటి తరంలో క్రమేనా సన్నగిల్లుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో పక్షం రోజుల పాటు నిర్వహించే వజ్రోత్సవ వేడుకలు జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తాయని మంత్రి వేముల ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న ఈ వేడుకల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో, ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు నడిపించి ప్రత్యేక రాష్ట్రం సాధించారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, ప్రజలు, రైతులకు సాగు, తాగునీరు ఇవ్వడంతోపాటు పేద, బడుగు బలహీనవర్గాలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం నిజమైన స్వాతంత్య్రం అని సీఎం కేసీఆర్ చాటి చెప్పారన్నారు.
గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా, దేశంలోనే మరెక్కడా లేని విధంగా పల్లెప్రగతి కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఈ నెల 15న 9 గంటలకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని మంత్రి ప్రశాంత్రెడ్డి కోరారు. విద్యార్థుల్లో భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని పెంపొందించేందుకు వీలుగా గాంధీ సినిమాను తప్పనిసరిగా చూపించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మాట్లాడుతూ నాటి మహనీయుల త్యాగాల ఫలితంగానే ప్రస్తుతం వజ్రోత్సవ వేడుకలు జరుపుకొంటున్నామని అన్నారు. జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు మాట్లాడుతూ మహాత్ములను స్మరించుకునేందుకు ఇది సువర్ణావకాశమని, 15 రోజుల పాటు వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు.
ఎమ్మెల్సీలు వీజీగౌడ్, రాజేశ్వర్ మాట్లాడుతూ వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మహనీయులను స్మరించుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టర్ నారాయణరెడ్డి పక్షం రోజుల పాటు కొనసాగే కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని, జిలా ్లవ్యాప్తంగా 4.51 లక్షల కుటుంబాలకు త్రివర్ణ పతాకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈనెల 12వ తేదీలోగా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆకుల లలిత, ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్, ఆర్మూర్, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్లు తూము పద్మాశరత్, పండిత్ వినితాపవన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.