కుల వృత్తులను నమ్ముకున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అన్ని రకాలుగా చేయూతనిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నది. ‘కుల వృత్తులకు సాటి రాదు గువ్వల చెన్న’ అన్న నానుడిని నిజం చేస్తూ అన్ని వర్గాలకూ అండదండగా ఉంటున్నది. సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు. ప్రధానంగా గొల్ల కుర్మల ఆర్థిక జీవనోపాధిని మెరుగు పరచాలన్న సంకల్పంతో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లాలో తొలి విడుతలో భాగంగా 8,522 మందికి గొర్రెలను అందజేశారు. వాటికి పిల్లలు పుట్టి జీవాల సంపద పెరిగింది. దీంతో గొల్ల, కుర్మల సంపాదన రెట్టింపయ్యింది. త్వరలోనే అర్హులైన 7,275 మందికి జీవాలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. గతంలో లాగే పైరవీలు, దళారుల పాత్ర లేకుండా పారదర్శకంగా యూనిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నది.
నిజామాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గొల్లకుర్మల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకువచ్చింది. వారి జీవనోపాధికి జీవం పోసేలా పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. పైరవీలు, దళారుల పాత్ర లేకుండా పారదర్శకంగా యూనిట్ల పంపిణీ ప్రక్రియ.. గడిచిన ఐదేండ్లుగా కొనసాగుతున్నది. రెండో దశలో కొందరికి యూనిట్లను పంపిణీ చేయగా, మిగిలిన అర్హులకు జీవాలను అందజేయాల్సి ఉంది. మాంసాహార మార్కెట్లో రాష్ట్రం వాటా పెంచాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు తగ్గట్లుగానే పల్లెల్లో జీవాల సంపద వృద్ధిచెందింది.
ప్రభుత్వం పంపిణీ చేసిన జీవాల విలువతో పోల్చితే ప్రస్తుతం ప్రతి యూనిట్లో 13 చొప్పున జీవాలు అదనంగా పెరిగాయి. దీంతో పల్లెల్లో జీవాల సంపద సృష్టి జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతున్నది. మొదటి దఫాలో యూనిట్ల పంపిణీకి రూ.104.26 కోట్లు ఖర్చుచేసి జీవాలను అందించగా, వాటికి 85,349 పిల్లలు పుట్టాయి. దీంతో గొల్లకుర్మలకు రూ. 42 కోట్ల ఆదాయం సమకూరింది. రెండో విడుతలోనూ అర్హులైన వారందరికీ గొర్రెల యూనిట్లను అందించి జీవాల సంఖ్యను పెంపొందించేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నది.
రెండో విడుతలో మిగిలిన వారు 7275 మంది..
గతంలో సహకార శాఖ ఆధ్వర్యంలో సొసైటీలను ఏర్పాటు చేయడంతో గొల్లకుర్మలు వాటి జోలికి వెళ్లాలంటే భయపడేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గొల్ల కుర్మల సొసైటీల ఏర్పాటుపై నిబంధనలను మార్చారు. చట్ట సవరణ చేసి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనే సొసైటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీంతో పారదర్శకంగా, కనిష్ఠ సభ్యత్వ రుసుముతోనే సొసైటీలు పురుడు పోసుకున్నాయి. 18 ఏండ్లు నిండిన వారంతా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సడలించిన నిబంధనలతో సొసైటీల సంఖ్య నిజామాబాద్ జిల్లాలో 329కి పెరిగింది. ఇందులో ప్రస్తుతం 20,971 సభ్యులున్నారు. 2017-18లో గొర్రెల యూనిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 9,631 మంది అర్హులను ఎంపిక చేయగా అందులో 8,522 మందికి యూనిట్లను అందజేశారు. రెండో విడుత 2018-19లో 9,475 మంది అర్హులను ఎంపిక చేసి జీవాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు 2,200 మందికి యూనిట్లను అందజేశారు. మిగిలిన 7,275 మందికి త్వరలోనే అందించనున్నారు.
స్పెషల్ డ్రైవ్..
ప్రస్తుతం మార్కెట్లో జీవాల ధర అమాంతం పెరగడంతో కొనుగోళ్లకు ఇబ్బందిగా మారింది. దీంతో ఈ భారం లబ్ధిదారులపై పడకుండా ఉండేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం యూనిట్ ధరను పెంచింది. నామమాత్రంగా లబ్ధిదారుడి వాటాను సైతం స్వల్పంగా పెంచి మిగిలిన సొమ్మంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేసేందుకు గతంలో లబ్ధిదారుల నుంచి రూ.31,250 డీడీ రూపంలో తీసుకున్నారు. మారిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం మరో రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్ విలువ, రాయితీని పెంచినందుకు లబ్ధిదారుల వాటాను సైతం పెంచినట్లు ప్రభుత్వం ఇప్పటికే వివరించింది.
ఇప్పటికే డీడీలు చెల్లించిన వారంతా ఈ మార్పులు, చేర్పుల మేరకు నూతన నిబంధనలకు అనుగుణంగా చెల్లిస్తున్నారు. పాత విధానంలో యూనిట్ విలువ రూ.1,25,000 ఉండగా, ఇందులో లబ్ధిదారుల వాటా రూ.31,250గా నిర్ణయించారు. కొత్త విధానంలో యూనిట్ విలువ రూ.1,75,000 కావడంతో లబ్ధిదారుడి వాటా రూ.43,759కు చేరింది. చాలా మంది లబ్ధిదారులు పెరిగిన కొత్త యూనిట్ ధర ప్రకారం చెల్లించకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత యూనిట్ల పంపిణీని త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం..
రెండో విడుత యూనిట్ల పంపిణీలో మిగిలిన వారందరికీ జీవాలను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే యూనిట్లను అందజేస్తాం. పెరిగిన యూనిట్ ధర ప్రకారమే లబ్ధిదారుడి వాటా కోసం డీడీలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ ఎం.భరత్, పశుసంవర్ధక శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా