కామారెడ్డి, ఆగస్టు 2 : కామారెడ్డి జిల్లాలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి 9. 30 గంటలకు చేరుకుంటారు. ఆయనకు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ బి.శ్రీనివాస్రెడ్డితోపాటు జిల్లా అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడే జిల్లా అధికారులతో ఎన్నికల కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉద్యోగార్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణా శిబిరాన్ని కలెక్టర్, ఎస్పీతో కలిసి సందర్శిస్తారు. ఉద్యోగార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో అవగాహన సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఈవీ ఎం గోదామును సందర్శించి ఎన్నికల సామగ్రిని భద్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కెమెరాలు, రామారెడ్డి రోడ్డు సమీపంలో ఉన్న ధరణి టౌన్షిప్లో ఉన్న వసతులను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, తహసీల్దార్ ప్రేమ్కుమార్, అధికారులు ఉన్నారు.