డిచ్పల్లి/ఆర్మూర్/వేల్పూర్/మోర్తాడ్/ ఏర్గట్ల, జూలై 21: ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సింఘాట్, కృష్ణ ప్రసాద్తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించింది.
వెంట ఉన్న కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కేంద్ర బృందం సభ్యులకు వరదలతో వాటిల్లిన నష్టం గురించి వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బాధిత రైతులు సైతం కేంద్ర బృందాన్ని కలిసి వరదలతో సంభవించిన నష్టం, ఎదుర్కొన్న ఇబ్బంది గురించి ఏకరువు పెట్టారు. నిరంతరాయంగా కురిసిన వర్షాలకు నీటమునిగిన పంటలు, తెగిన చెరువులు, కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు, నష్టం వివరాలను ఆయా ప్రాంతాల వారీగా నమోదు చేసుకున్నారు. ముందుగా వరద ఉధృతికి కొట్టుకుపోయిన జక్రాన్పల్లి మండలం పడకల్ పెద్దచెరువును పరిశీలించారు.
ఈ చెరువు కింద 527 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నీట మునిగాయని, కట్ట తెగిపోవడంతో కేశ్పల్లి, కొరట్పల్లి, ధర్పల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని కలెక్టర్ నారాయణరెడ్డి కేంద్ర బృందం దృష్టికి తెచ్చారు. అనంతరం కేంద్ర బృందం మనోహరాబాద్-కలిగోట్ గ్రామాల మధ్య కొట్టుకుపోయిన రోడ్డు, ఇదే మార్గంలో వరదనీటిలో మునిగి ఇసుక మేటలు వేసిన వరి, మక్కజొన్న, సోయా, పసుపు పంటలను పరిశీలించారు.
ఆర్మూర్ మండలం పిప్రి, మంథనికి వెళ్లే వాగులో దెబ్బతిన్న లోలెవల్ వంతెన, కాజ్వేను సందర్శించారు. పలుచోట్ల ధ్వంసమైన బీటీ రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్ను కేంద్ర బృందం తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేల్పూర్ మండలం జాన్కంపేట్-పచ్చలనడ్కుడ గ్రామాల మధ్యలో ఉన్న పెద్దవాగులో వరద తాకిడికి పూర్తిగా ధ్వంసమైన చెక్డ్యామ్, మోర్తాడ్ మండలం దొన్కల్ శివారులో స్వర్ణవాగు, కూలిన వంతెన, ఏర్గట్ల మండలం దోంచంద వద్ద నష్టపోయిన పంటలు, ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు.
నష్టం వివరాలు వివరించిన కలెక్టర్
కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆయా శాఖల అధికారులు ఆద్యంతం కేంద్ర బృందం వెంటనే ఉండి, వరద నష్టం వివరాలను క్షుణ్ణంగా తెలియజేశారు. వరద నష్టాన్ని అధ్యయనం చేసిన కేంద్ర బృందం పలు అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నది. సమగ్ర వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని బృందం సభ్యులు పేర్కొన్నారు. కేంద్ర బృందం వెంట ఇరిగేషన్ ఎస్ఈ నారాయణ, ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈలు శంకర్, మురళి, భావన్న ఉన్నారు.