సహజ వనరులను కాపాడుతూ భావితరాలకు అందించడమే లక్ష్యంగా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) విస్తృతంగా పని చేస్తున్నది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంప్ వాసులు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ప్రస్తుతం 14 కుటుంబాలకు చెందిన వారు టీఎస్ రెడ్కో ద్వారా రాయితీపై సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు.
ప్రస్తుతం వీరు గృహ అవసరాలకు సోలార్ విద్యుత్ను వినియోగించుకోవడమే కాకుండా మిగులు విద్యుత్ను ఎన్పీడీసీఎల్కు విక్రయిస్తున్నారు. సౌర పలకల ద్వారా నెలవారీగా ఎన్పీడీసీఎల్కు చెల్లించే విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తొలగిపోవడంతోపాటు అదే ఎన్పీడీసీఎల్కు విద్యుత్ను విక్రయించే స్థాయికి చేరారు. తద్వారా వీరు నెలకు కనిష్ఠంగా రూ.400 నుంచి రూ.600 వరకు ఎన్పీడీసీఎల్ నుంచి ఆదాయం పొందుతుండడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు వెయ్యి యూనిట్ల చొప్పున సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో యూనిట్కు 40 శాతం రాయితీ ఇవ్వనున్నది.
నిజామాబాద్, జులై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సహజ వనరులను ఇష్టానుసారంగా వినియోగిస్తుండడంతో అవి తరిగిపోతున్నాయి. వాటిని పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత సమాజంపై ఉంది. ముఖ్యంగా విద్యుత్ను పొదుపు చేస్తే దాని ఉత్పత్తి కోసం వినియోగించే జలం, బొగ్గు నిల్వలను కాపాడుకున్నట్లే. ప్రస్తుతం ప్రపంచం, దేశం, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అంతా కూడా బొగ్గు ఆధారితమైన థర్మల్ పవర్ యూనిట్ల స్థాపితంతోనే జరుగుతున్నది. కాలక్రమేణా భూ అంతర్భాగంలో లభించే విలువైన బొగ్గు తరిగిపోయి భావితరాలకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. మరోవైపు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తితో గ్లోబల్ వార్మింగ్ వంటి ఉపద్రవాలు సైతం ముంచుకొస్తున్నాయి.
ఈ దశలో ప్రపంచమంతా సౌర విద్యుత్వైపు అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీఎస్ రెడ్కో తీవ్రంగా కృషి చేస్తున్నది. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో సామాన్యులకు ఉపశమనం కలిగిస్తున్నది. బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామం ఇప్పుడు ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నది. సౌర కిరణాలను ఒడిసి పట్టుకుని గృహ అవసరాలకు విద్యుత్ను ఇంటి మీది నుంచే ఉత్పత్తి చేసుకుంటూనే తిరిగి ఎన్పీడీసీఎల్కు మిగులు విద్యుత్ను అమ్ముతున్న తీరుపై ప్రత్యేక కథనం.
అనుకూల వాతావరణం
రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, వాతావరణ అనుకూలతలు సోలార్ విద్యుత్ ఉత్పత్తికి తోడుగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కువగా పొడి వాతావరణం ఉండడంతో సులభంగా ఉత్పత్తి అవుతుంది. సముద్ర మట్టానికి తెలంగాణ ఎత్తైన ప్రాంతం కావడంతో ఎండలు ఎక్కువగా రావడం సానుకూల అంశం. అందులోనూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రాంతమంతా ఉష్ణోగ్రతలు సాధారణ సమయంలో గరిష్టంగా 30 డిగ్రీలు(శీతాకాలం మినహాయిస్తే), ఎండాకాలంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కేవలం నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఉత్పత్తికి కాసింత విరామం లభించినా… మిగిలిన 9 నుంచి 10 నెలల కాలం అనుకూలాంశమే ఉండడం విశేషం.
ఇంటికి వాడుకున్న కరెంట్కు డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో వాషింగ్ మిషిన్, ఫ్రిజ్, 2 ఫ్యాన్లు, నాలుగు లైట్లు, టీవీలతో నెలవారీ బిల్లు రూ.1000కి పైగా వస్తుంది. రాయితీతో అందించిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంతో ప్రతి నెలా బిల్లుల భారం, విద్యుత్ కోతల ఇబ్బంది ఉండదు. సోలార్ పవర్ ప్లాంట్లను ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అప్పటి వరకు కరెంట్ బిల్లు ఇబ్బందులు తీరినట్లే. ఇంధన పొదుపు ఆవశ్యకతపై అవగాహన కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) ఏటా డిసెంబర్లో వారోత్సవాలు నిర్వహిస్తోంది. సహజ సిద్ధంగా లభించే సూర్యరశ్మిని ఇంధనంగా వాడుకోవాల్సిన అవసరం, అవకాశాలపై అవగాహనను కల్పిస్తోంది.
పవర్ చూపుతున్న అంకోల్ క్యాంప్..
ప్రకృతి సంపద మానవాళికి మేలు చేస్తుంది. అందిపుచ్చుకున్న వారికి వరాల జల్లు కురిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్లోని ప్రజలు సూర్యరశ్మిని సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసి నెలవారీ ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇంట్లో బహుళ అవసరాలకు వినియోగించుకునేంత సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని ఊరట పొందుతున్నారు. విద్యుత్ పొదుపును ప్రోత్సహించేందుకు టీఎస్ రెడ్కో సంస్థ సోలార్ ప్లాట్ల ఏర్పాటు కోసం పలు రాయితీలు ఇస్తున్నది. దీంతో పాటు తక్కువ విద్యుత్ వినియోగం అయ్యే ఎల్ఈడీ బల్బులను, ట్యూబ్లైట్లను, ఫ్యాన్లను సగం ధరలకే అందిస్తోంది. గృహ, వ్యాపార, వ్యవసాయ పంపు సెట్లకు అవసరమైన విద్యుత్ కోసం సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి రాయితీలు ఇస్తున్నది. కొందరు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని తమ అవసరాలకు విద్యుత్ వాడుకుని ఖర్చులు తగ్గించుకుంటున్నారు. గృహ అవసరాల కోసం సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 1 నుంచి 3 కిలో వాట్స్కి 40శాతం, 4 నుంచి 10 కిలో వాట్స్కి 20శాతం చొప్పున టీఎస్ రెడ్కో సంస్థ రాయితీ ఇస్తున్నది. ఈ రాయితీని అంకోల్ క్యాంప్ గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్త గుర్తింపును సొంతం చేసుకుంటుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
మిగులు విద్యుత్ విక్రయం..
అంకోల్ క్యాంప్లో ప్రస్తుతం 14 కుటుంబాలకు చెందిన వారు టీఎస్ రెడ్కో ద్వారా రాయితీ సోలార్ పవర్ ప్లాంట్లను దక్కించుకున్నారు. వీటికి మొదటగా సొంతంగా పెట్టుబడిని వెచ్చించి ప్రభుత్వ సహకారంతో సోలార్ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. అంకోల్ గ్రామ సర్పంచ్ బాడిగ వెంకటరమణతో పాటు ఈదర మాధవి, జంపాల సత్యనారాయణ, అయ్యన్న, ప్రమోద్ కుమార్, కన్నెగంటి నాగలక్ష్మి, పద్మ, రవితేజ, సుంకరి శ్రీనివాస్ రావు, తూము రామరాజు, కందుల నాగేశ్వరరావు, పట్టాభిరామయ్య, కొయ్యలముడి స్వప్న, నాంచారమ్మ పేర్లతో 14 పవర్ ప్లాంట్లు ఇక్కడ వెలిశాయి. వీరందరూ కలిసి 2021 డిసెంబర్ నుంచి జూన్ 2022 వరకు మొత్తం 30,037 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఇందులో 18,911 యూనిట్లను గృహ అవసరాలకు వినియోగించుకున్నారు. 11,126 యూనిట్ల విద్యుత్ను తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్)కు విక్రయించారు. తద్వారా వీరికి అదనంగా రూ.47,842 ఆదాయం సమకూరింది. ఇంటి పైకప్పు, ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న సౌర పలకల ద్వారా నెలవారీగా ఎన్పీడీసీఎల్కు చెల్లించే విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తొలగిపోవడంతో పాటుగా అదే ఎన్పీడీసీఎల్కు విద్యుత్ను విక్రయించే స్థాయికి చేరారు. తద్వారా వీరు నెలకు కనిష్టంగా రూ.400 నుంచి రూ.600 వరకు ఎన్పీడీసీఎల్ నుంచి ఆదాయం పొందుతుండడం విశేషం.
సోలార్ చర్యలతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది..
మా గ్రామంలో ప్రస్తుతం 14 మంది వరకు సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ వినియోగంలో స్వయం సమృద్ధిని సాధించారు. గడిచిన ఏడు నెలల్లో ఆయా కుటుంబ అవసరాలకు విద్యుత్ను వాడుకోగా మిగిలిన విద్యుత్ను టీఎస్ ఎన్పీడీసీఎల్కు విక్రయించారు. ఇలా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో చాలా ప్రయోజనాలు దక్కుతున్నాయి. తిరిగి మనకే ఆదాయం సమకూరుతుండడం ఆశ్చర్యంగానే ఉంది. మా గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది.
– బాడిగ వెంకట రమణ, అంకోల్ క్యాంప్ సర్పంచ్
కరెంట్ను అమ్ముతున్నాం..
మా ఇంటి మిద్దెపై 3 కిలో వాట్స్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. ఇందుకోసం సుమారుగా రూ.లక్ష వరకు ఖర్చు వచ్చింది. పోయిన ఏడాది డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు ఏడు నెలల్లో మా ఇంటి అవసరాలకు కరెంట్ వినియోగించుకోగా ప్రభుత్వానికే తిరిగి కరెంట్ను విక్రయించాం. తద్వారా రూ.4,481 ఆదాయం మాకే వచ్చింది. గడిచిన కొద్ది రోజులుగా కరెంట్ బిల్లుల ఇబ్బంది లేదు. పుష్కలంగా కరెంట్ను వాడుకున్నాం.
-కొయ్యలముడి నాంచారమ్మ, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న గ్రామస్తురాలు