మెండోరా, జూలై 3 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గిపోయిందని ఏఈఈ రవి తెలిపారు. రిజర్వాయర్లోకి 8,680 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదన్నారు. ఈ సీజన్లో ఎగువ నుంచి 7.048 టీఎంసీల వరద వచ్చిందని తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1068.00 అడుగుల (25.292 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.
పోచారంలోకి 17 క్యూలసెక్కుల ఇన్ఫ్లో..
నాగిరెడ్డిపేట్, జూలై 3 : నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వారం రోజులుగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి కొత్తనీరు వస్తున్నదని ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నదని, ప్రాజెక్టులోకి ఆదివారం 17 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం 8.5 అడుగుల మేర నీరు ఉన్నట్లు వెల్లడించారు.