నిజామాబాద్ రూరల్, జూలై 3 : గుంతలమయంగా మారిన మట్టి రోడ్డుపై బీటీ రోడ్డును నిర్మించడంతో నాలుగు గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారులోని కాలూర్, ముబారక్నగర్, కాలేపల్లి క్యాంప్, రెడ్డిక్యాంప్ గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 2 కోట్ల 23 లక్షల 77 వేల రూపాయల నిధులు మంజూరు చేయించారు.
ఈ నిధులతో ముబారక్నగర్ గ్రామశివారులోని సుఖ్జిత్ ఫ్యాక్టరీ నుంచి వయా రెడ్డిక్యాంప్, కాలేపల్లి క్యాంప్ మీదుగా కాలూర్ వరకు 3.10 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించారు. అవసరమున్న ప్రాంతాల్లో కల్వర్టులను కూడా నిర్మించారు. దీంతో బీటీ రోడ్డు తళతళా మెరవడంతోపాటు నాలుగు గ్రామాల ప్రజల రాకపోకలకు ప్రయాణం సౌలభ్యంగా మారింది. ప్రయాణాలకు, పంట ఉత్పత్తులను తమ ఇండ్లకు తెచ్చుకునేందుకు రోడ్డు చాలా సౌకర్యంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలూర్, కాలేపల్లి క్యాంప్, రెడ్డి క్యాంప్ వాసులు ఆర్మూర్తోపాటు మాక్లూర్ మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే వారికి దూరభారం తగ్గుతుంది. రోడ్డు నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డీఈ శంకర్, ఏఈ నరేశ్ పర్యవేక్షించారు.
రోడ్డుపై కేజ్వీల్ ట్రాక్టర్ను నడిపితే రూ.10వేల జరిమానా..
కొత్తగా వేసిన బీటీ రోడ్డుపై ఎవరైనా కేజ్వీల్ ట్రాక్టర్ను నడిపితే రూ. 10 వేల జరిమానా వేయడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రైతులు రోడ్డుపై కేజ్వీల్ ట్రాక్టర్లు నడుపవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఎమ్మెల్యే బాజిరెడ్డికి రుణపడి ఉంటాం
మట్టి రోడ్డు అధ్వానంగా మారడంతో రాకపోకలలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వానకాలంలో మట్టి రోడ్డుపై పొలాలకు వెళ్లడానికి రైతులు అవస్థలు పడేవారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించారు. మట్టి రోడ్డుపై డాంబర్ రోడ్డు వేశారు. రోడ్డు వేయించిన ఎమ్మెల్యేకు నాలుగు గ్రామాల ప్రజలందరం రుణపడి ఉంటాము.
– కొర్వ శ్రీనివాస్, రైతు, కాలూర్