నిజామాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జరిగిన ముఖ్య నేతల పర్యటనలు తూతూ మంత్రంగా జరిగాయి. హైదరాబాద్ హెచ్ఐసీసీలో సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలుగా నియమించబడిన వారంతా మూకుమ్మడిగా పర్యటించారు. ఇందులో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కేంద్ర సహాయ మంత్రులు, బీజేపీ ఎంపీలు, జాతీయ పార్టీ కార్యవర్గసభ్యులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో ఆయా ప్రాంతాలకు వెళ్లిన వారందరికీ అడుగడుగునా హరితహారంలో నాటిన మొక్కలు, అందమైన రహదారులు, అంతర్గత రోడ్లు, సర్వాంగ సుందరంగా కనిపించే పల్లెలు, పల్లెప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఇక పట్టణాల్లో డివైడర్లు, హైమాస్ట్ లైట్లు, ఎల్ఈడీ విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న అభివృద్ధిని చూసి అవాక్కయ్యారు. ఉమ్మడి జిల్లాకు వచ్చిన వారిలో రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఆయా రాష్ర్టాల్లో కనిపించని అభివృద్ధిని కొంగొత్తగా చూసిన అనుభవాన్ని మూటగట్టుకొని వారంతా వెనుదిరిగారు. మరోవైపు పరభాష వ్యక్తుల సందేశాలను అర్థం చేసుకోలేక స్థానిక కమలం పార్టీ నేతలు తలలు పట్టుకున్నట్లు తెలిసింది.
వచ్చారు… వెళ్లారు…
ఆర్మూర్ నియోజకవర్గంలో కేంద్ర పర్యాటక, హోం శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రెండు రోజుల పాటు పర్యటించారు. ఇందులో భాగంగా ఆర్మూర్, నందిపేటలో నేతలతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి హోదాలో వచ్చిన ఆయన కేవలం రాజకీయ మీటింగ్ను నిర్వహించుకొని వెనుదిరిగారే తప్పా ఆర్మూర్ ప్రజలకు వరాలను మాత్రం ప్రకటించలేక పోయారు. నిజామాబాద్ రూరల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ఫగన్ సింగ్ పర్యటించాడు. గ్రామీణాభివృద్ధిపై ఏదేదో మాట్లాడుదామని భావించాడు. కానీ 2022లోనే దేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన అవార్డుల్లో 20 జీపీలు తెలంగాణవే ఉన్నాయి. అందులో ఐదు గ్రామాలు నిజామాబాద్ జిల్లాకు చెందినవి కావడం విశేషం. ఈ గణాంకాలు ముందే తెలిసిన కేంద్ర సహాయ మంత్రి గ్రామాల అభివృద్ధిపై పల్లెత్తు మాటెత్తకుండా వెనుదిరిగాడు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో పల్లెలను కండ్లారా చూసి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి నమూనాలను పరిశీలిస్తే తెలంగాణ సర్కారు కృషి మరింతగా తెలిసేదని ప్రజలంతా అనుకుంటున్నారు. కేవలం ఓట్లను రాబట్టేందుకు, రాజకీయ కుయుక్తులు పన్నేందుకు మాత్రమే వచ్చిన కేంద్ర మంత్రులు ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా వెనుదిరగడంపై సామాజిక వేత్తలు విమర్శిస్తున్నారు.
ఫక్తు రాజకీయమే..
ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చినా, ఎంపీలు వరుస కట్టినా.. ఉమ్మడి జిల్లా ప్రజలకు పైసా లాభం లేకపోయింది. బీజేపీకి ఫక్తు రాజకీయాలు మినహా ప్రజా సంక్షేమం పట్టదనే విషయం రెండు రోజుల బీజేపీ నేతల పర్యటనతో మరోసారి రుజువైందని ప్రజలు భావిస్తున్నారు. ఇక బాన్సువాడకు వచ్చిన బీజేపీ సిక్కిం రాష్ట్ర అధ్యక్షుడు, బోధన్ నియోజకవర్గానికి మహారాష్ట్రకు చెందిన విజయ రహత్కర్ అనే బీజేపీ జాతీయ నాయకురాలు వివిధ సమావేశాల్లో నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు తెలిసింది. అయితే బోధన్ మీటింగ్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసిందని సమాచారం. ఎస్సీ, ఎస్టీ మోర్చాలతో నిర్వహించిన సమావేశంలో దళితబంధు పథకం అమలుపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఎస్సీ మోర్చాలో పలువురు దళిత నాయకులు కేసీఆర్ తెచ్చిన గొప్ప పథకాన్ని వివరించడంతో సదరు నాయకురాలు అవాక్కయినట్లు తెలుస్తున్నది. దళితబంధులాంటి పథకం బీజేపీ తీసుకువస్తే బాగుంటుందని స్థానిక దళిత నాయకులు కోరగా అలాంటి కోరికలు మానుకోవాలని బీజేపీ ముఖ్యులు సూచించినట్లుగా సమాచారం. దళితబంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేయరని అంతా అనుకున్నామని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తుండడం ఇబ్బందిగా మారినట్లుగా సొంత పార్టీ నేతలు కొంతమంది జాతీయ నాయకురాలితో వాపోయినట్లు తెలిసింది.
రెచ్చగొట్టడమే మన విధానం..
భారతీయ జనతా పార్టీ పేరు వింటేనే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కేరాఫ్గా మారింది. అసంబద్ధ ఆరోపణలు, నిజాలు లేని మాటలతో పబ్బం గడుపుకొనే దుస్థితికి దిగజారిందనే విషయాన్ని కొత్తగా చెప్పనక్కర్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బాధ్యతగా వ్యవహరించాల్సిన నేతలెవ్వరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోవడం గత కొంతకాలంగా చూస్తున్నదే. అభివృద్ధి, సంక్షేమం అన్న పదాన్ని పక్కకుపెట్టి నిత్యం ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించడం, ఆయా వర్గాలను రెచ్చగొట్టేలా ఉసిగొల్పడమే వారి ప్రధాన కర్తవ్యం. టీఆర్ఎస్ను ఢీకొట్టాలంటే అబద్ధాలను ప్రచారం చేయాలని, వర్గ విభేదాలు సృష్టించాలని అంతర్గత సమావేశాల్లో హితబోధ చేసినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఇన్చార్జీగా వచ్చి స్థానికంగా ఓ ఫంక్షన్ హాలులో మీటింగ్ నిర్వహించారు. ఇందులో ఇదే విషయాన్ని నొక్కి చెప్పినట్లుగా తెలిసింది. ప్రజలకు వాస్తవాలు చెప్పడం కన్నా అబద్ధాలతో మాయ చేయడమే ముఖ్యమని మరికొందరు పరభాష నాయకులు మాట్లాడినట్లుగా తెలుస్తున్నది.