మెండోరా, జూలై 2 : ఎస్సారెస్పీలోకి ఒక్కరోజులో 1.237 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు ఏఈఈ రవి శనివారం తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల ఒకటో తేదీన తెరుచుకోగా..ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి ఒక్కరోజు వ్యవధిలో 1.237 టీఎంసీల వరద వచ్చి చేరిందని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,046 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందన్నారు. ఇన్ఫ్లో సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశముందని తెలిపారు.
కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి 1067.60 అడుగుల (24.616 టీఎంసీలు) వద్ద ఉన్నదని వివరించారు. ఈ సీజన్లో ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 6.298 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1069.90 అడుగుల (28.682 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ వివరించారు.