నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 2 : జిల్లావ్యాప్తంగా అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పలు సొసైటీల వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. సహకార సంఘం ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సొసైటీల ఆవరణలో సహకార జెండాలను సొసైటీల చైర్మన్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సహకార సంఘాల అభివృద్ధికి రైతులు సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతులకు దేశంలో ఎక్కడా లేని పథకాలతో అండగా నిలుస్తున్నారన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశారాన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమాల్లో వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. మోర్తాడ్లోని సొసైటీ ఆవరణలో సహకార జెండాను చైర్మన్ కళ్లెం అశోక్ ఎగురవేశారు.
భీమ్గల్ మండలం ముచ్కూర్లో చైర్మన్ వెంకటేశ్ అసిస్టెంట్ సెక్రటరీ మురళీగౌడ్ కలిసి జెండాను ఆవిష్కరించారు. కమ్మర్పల్లిలో పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ సహకార జెండాను ఎగురవేశారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, పిప్రి సొసైటీలో చైర్మన్ సోమ హేమంత్రెడ్డి, ఫత్తేపూర్లో శ్రావణ్రెడ్డి, ఆలూర్లో భోజారెడ్డి, పెర్కిట్లో పెంట భోజారెడ్డి, గోవింద్పేట్లో మహిపాల్, ఆర్మూర్లో ముత్తెన్న సొసైటీ ఆవరణలో సహకార జెండాలను ఆవిష్కరించారు. బోధన్ మండలంలోని సాలూర గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో సొసైటీ చైర్మన్ జనార్దన్ సహకార జెండాను ఎగరవేశారు. రెంజల్ మండలంలోని నీలా, దూపల్లి, రెంజల్ సహకార సంఘాల్లో చైర్మన్లు జెండాలను ఆవిష్కరించారు. ఎడపల్లిలోని సొసైటీ ఆవరణలో అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి జెండాను ఆవిష్కరించారు.
కోటగిరి మండలం పొతంగల్ విశాల సహకార పరపతి సంఘం ఆవరణలో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్పటేల్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ధర్పల్లి మండలకేంద్రంలోని సొసైటీ వద్ద చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, కార్యదర్శి సంతోష్రెడ్డి సహకార జెండాను ఎగురవేశారు. డిచ్పల్లి సహకార సంఘంలో డీసీవో సింహాచలం విండో చైర్మన్ గజవాడ జైపాల్తో కలిసి జెండాను ఆవిష్కరించారు. డిచ్పల్లి మండలంలోని సహకార సంఘంలో పీఏసీఎస్ చైర్మన్ గజవాడ జైపాల్ అధ్యక్షతన వేడుకలను నిర్వహించారు. సంఘ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఇందల్వాయి, నల్లవెల్లి సొసైటీల్లో చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు.