నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఇంధన కల్తీ కలకలం రేపుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట కల్తీలకు సంబంధించిన ఘటనలు వెలుగు చూస్తుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంధన డిమాండ్ను సాకుగా తీసుకున్న పెట్రోల్ బంకుల నిర్వాహకులు యథేచ్ఛగా కల్తీకి తెరలేపి తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ తక్కువగా పోయడం, కల్తీ చేస్తూ వినియోగదారుడిని నిలువునా మోసానికి గురిచేస్తున్నారు. కల్తీ గుర్తించి నిలదీస్తున్నా స్పందించే వారు కరువయ్యారు. సంబంధిత చమురు సంస్థల అధికారులు తనిఖీలు చేపట్టాల్సి ఉన్నా.. పట్టించుకోకపోవడంతో నాణ్యత, నిర్ణీత ప్రమాణాలను పలు బంకుల నిర్వాహకులు గాలికొదిలేశారు.
బలరాం… ఓ రైతు. తన వాహనంలో నిత్యం పెట్రోల్ తక్కువ వస్తుండడాన్ని గమనించి ఈసారి ఖాళీ వాటర్ బాటిల్ను వెంట తీసుకెళ్లాడు. అందులో పెట్రోల్ పోయించుకోవడంతో నిర్వాహకుల బాగోతం బట్టబయలైంది. పెట్రోల్తోపాటు నీళ్లు సైతం వచ్చి చేరడంతో బాటిల్లో స్పష్టంగా కల్తీ పెట్రోల్ను గుర్తించి బంకు వారిని నిలదీశారు. బిత్తరపోయిన వారంతా బలరాంను సముదాయించి క్షమాపణలు చెప్పి పంపించేశారు. ఇది సరిగ్గా 10 రోజుల క్రితం కామారెడ్డి పట్టణ శివారులోని ఓ బంకులో వెలుగు చూసిన ఘటన.
ఇలా చెప్పుకుంటూ పోతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట పెట్రోల్, డీజిల్ పేరిట మోసాలు జరుగుతున్నాయి. పట్టణం, గ్రామీణ ప్రాంతమనే తేడా లేకుండా కల్తీ దందా జరుగుతున్నది. నిర్ణీత డబ్బుల కన్నా తక్కువగా ఇంధనం పోయడం లేదంటే నీళ్లు కలిపి మోసాలకు పాల్పడడం వంటివి నిత్యకృత్యమవుతున్నాయి. వీటిని నివారించాల్సిన కేంద్ర ప్రభుత్వంలోని చమురు సంస్థల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం తనిఖీలు చేపట్టకపోవడంతో బంకుల్లో వ్యవహారాలు ఇష్టానుసారంగా మారాయి.
ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ స్పందించే వారు కరువయ్యారు. లిప్టస్ కాగితంతో పరీక్షలు నిర్వహించే పద్ధతులను సైతం అనేక బంకుల్లో మూలకు పడేశారు. వాహనదారులను చైతన్యపరుస్తూ కల్తీని పరీక్షించే పద్ధతులపై బ్యానర్లు ప్రతి బంకుల్లో పెట్టాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా కనిపించడం లేదు. తేడాలు వెలుగు చూస్తే ఫిర్యాదులు చేసేందుకు సంబంధిత చమురు సంస్థల అధికారుల నెంబర్లు కూడా ఎక్కడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. బంకుల్లో జరిగే అక్రమ తంతుకు చమురు సంస్థల బాధ్యులే వెనుకుండి మద్దతు ఇస్తున్నారా? అన్న సందేహాలు సైతం బలపడుతున్నాయి.
ఇప్పటికే మోయలేని భారం…
ప్రధాని నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికే ప్రజలు సాఫీగా జీవనం సాగించే పరిస్థితులు కనుమరుగై పోయాయి. నెలవారీ జీతం డబ్బులు కేవలం పొట్టకే ఖర్చు చేయాల్సి వస్తుండగా పిల్లల చదువులకు, ఇతరత్రా ఖర్చులకు వాడుకోవడానికి జేబులు ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. ఈ సమయంలో వ్యయప్రాయాసాలకోర్చి పెట్రోల్, డీజిల్ను వాహనాల్లో కొట్టించుకుంటున్న వాహనదారులకు కల్తీ పెట్రోల్, బంకుల్లో మోసాలు ఆశానిపాతంలా మారుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.112లకు లభిస్తున్నది. డీజిల్ లీటర్కు రూ.100కు చేరింది. ఏడాది కిందటితో పోలిస్తే 30శాతానికి మించి ఇంధన భారం సామాన్యులపై తీవ్ర స్థాయిలో చూపుతున్నది. ఈ పరిస్థితిలో నాణ్యమైన పెట్రోల్, కచ్చితమైన సేవలను ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా పెట్రోల్ బంకుల్లో పరిస్థితులు అద్దం పడుతుండడంతో సామాన్య జనమంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కల్పించాల్సిన వసతులు, సౌకర్యాలపైనా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
కల్తీ కలకలం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంధన కల్తీ కలకలం రేపుతున్నది. ఎక్కడో ఒక చోట నిత్యం కల్తీలకు సంబంధించిన ఘటన వెలుగు చూస్తుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే చమురు సంస్థల నిర్వహణ వైఫల్యంతో సామాన్య జనాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. బంకుల్లో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న బడా చమురు సంస్థలు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలో వైఫల్యం చెందుతున్నాయి.
బంకుల్లో నిర్వహణ లోపమా? లేదంటే కావాలనే కక్కుర్తి పడి నీళ్లను కలుపుతున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత చమురు సంస్థకు సంబంధించిన అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. అలాంటిదేమీ మచ్చుకూ కనిపించకపోవడంతో సామాన్యులకు గడ్డు పరిస్థితి ఎదురవుతున్నది. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాలను రోడ్లపైకి ఎక్కించాలంటేనే జంకే దుస్థితి నెలకొన్నది. ఈ గడ్డు పరిస్థితిలో కల్తీ పేరిట ఇంధన విక్రయాలు జరగడంతోపాటు పెట్రోల్కు గండి కొట్టే పద్ధతులతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సామాన్యులకు భారం..
కేంద్రంలో బీజేపీ వచ్చిన నాటి నుంచి పెట్రోల్ ధరలు పెంచడంతో సామాన్యులపై అధిక భారం పడుతున్నది. సామాన్యులు వాహనాలపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పెట్రోల్ భారం ఎంతో ఇబ్బందికరంగా మారింది.
– శ్రీనివాస్, కామారెడ్డి