నిజామాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుబంధు పథకం వచ్చిన తర్వాత రైతుల బతుకులు గాడిలో పడుతున్నాయి. గతంలో ప్రభుత్వాలకే పన్నుల రూపంలో వారు చెల్లించే పరిస్థితి ఉండేది. కానిప్పుడు సీఎం కేసీఆర్ చొరవతో పెట్టుబడి సాయం కింద నగదు నేరుగా రైతులకే అందిస్తున్నారు. భూమి విస్తీర్ణాన్ని అనుసరించి గుంట భూమి ఉన్న రైతు మొదలుకొని పట్టాదారు పేరు మీద ఉన్న భూముల వివరాల మేరకు ఆర్థిక సాయం చేరుతోంది. ఎకరానికి రూ.5వేలు చొప్పున పట్టాదారు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. వానకాలం మొదలైన కొద్ది రోజుల్లోనే జాప్యం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేరుస్తోంది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో రూ.వేల కోట్లు వెచ్చించి రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండడంతో సీఎం కేసీఆర్కు రైతన్నలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు నగదు జమ అయ్యింది. అనేక చోట్ల కేసీఆర్ చిత్రపటాలకు కర్షక లోకం క్షీరాభిషేకాలతో హోరెత్తించింది. కేసీఆర్ చేస్తున్న ఉపకారాన్ని గుర్తుకు చేసుకుంటూ నినాదాలిస్తూ సంబురాలు సైతం నిర్వహించారు.
తొలి రోజు ఎకరంలోపు..
తొలి రోజు రైతుబంధు సాయం ఎకరం భూమి ఉన్న అన్నదాతలందరికీ చేరింది. గుంట భూమి నుంచి ఎకరం వరకు విస్తీర్ణంతో పట్టా పాస్పుస్తకాలు కలిగిన వారందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. ఇలా రోజువారీగా తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు పెట్టుబడిసాయం అందజేయనున్నారు. గతంలో కూడా ఇదే రకమైన పద్ధతిని ప్రభుత్వం అవలంబించింది. మొదట సన్న, చిన్న కారు రైతులకు ప్రాధాన్యం ఇస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. వానకాలంలో నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 74వేల 522 మంది రైతులకు రూ.273.83 కోట్లు పంపిణీ చేయనున్నారు. కొత్త పట్టాపాస్ పుస్తకాలు 11వేల 415 ఉన్నాయి. వీరందరూ జూలై 10వ తేదీలోపు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేయనున్నది. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 92వేల మంది రైతులకు రూ.260.84కోట్లు పంపిణీ చేయనున్నారు. నిజామాబాద్లో తొలి రోజు 85,927 మంది రైతులకు రూ.25కోట్ల 56లక్షల 4వేల 839, కామారెడ్డి జిల్లాలో లక్షా 7వేల 28 మందికి రూ.28కోట్ల 59లక్షల 66వేల 390 నగదు జమ చేశారు. కొత్తగా పాస్పుస్తకాలు పొందిన వారు కామారెడ్డిలో వేలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది.
మోదీ ఆటంకాలు..
రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న పథకం దేశంలో మరెక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కర్షకులకు ఎదురు డబ్బులిచ్చి సాగుకు ప్రోత్సాహం అందిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ర్టాల్లోనూ ఇలాంటి పథకాన్ని అమలు చేసేందుకు ధైర్యం చేయడం లేదు. తొలిసారిగా రైతుబంధు పేరుతో సాగు ఖర్చులకు డబ్బులు అందిస్తున్న తెలంగాణ రాష్ర్టాన్ని చూసి మిగిలిన రాష్ర్టాలు నివ్వెర పోతున్నాయి. రైతుకు అందుతున్న ప్రోత్సాహాన్ని చూసి పక్క రాష్ర్టాలకు చెందిన వారంతా అవాక్కవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాలుగేండ్లుగా విజయవంతంగా అమలైన రైతుబంధు పథకాన్ని అమలు కాకుండా ఉండేందుకు ఏడాదిన్నర కాలంగా కేంద్ర సర్కారు కిరికిరి పెడుతోంది. ఓ వైపు ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెట్టి ఎఫ్సీఐ పేరుతో మోదీ సర్కారు ఇబ్బందులు సృష్టించింది. తాజాగా ఆర్థిక వనరులపై కన్నేసి ప్రభుత్వానికి కుట్రపూరితంగా సమస్యలు సృష్టించింది. రకరకాలుగా బీజేపీ ప్రభుత్వ పెద్దలు రైతులకు అందాల్సిన సేవల్లో ఆటంకాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కుటిల ప్రయత్నాలకు ఒడిగడుతున్నారు.కేసీఆర్ మాత్రం వీటన్నింటినీ ఎదుర్కొని రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కష్టకాలంలో కర్షకుడికి తోడు నీడగా నిలుస్తున్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సీఎం కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఆయనకు రైతులందరం రుణపడి ఉంటాం. పంటలు వేసే సమయానికి రైతుబంధు డబ్బులు రావడం చాలా సంతోషంగా ఉంది.
-కొమ్ము వనిత రైతు, గోన్గొప్పుల, భీమ్గల్ మండలం
సీఎం సారుకు ధన్యవాదాలు
వానకాలం పంట పెట్టుబడి కింద నా అకౌంట్లో పైసలు పడ్డట్లు ఫోనుకు మెస్సేజ్ వచ్చింది. సకాంలో పైసలు వేసిన సీఎం సారుకు ధన్యవాదాలు. రైతులకు మేలు చేసేందుకు సీఎం అ నేక పథకాలు తీసుకొస్తుండు. పం ట పెట్టుబడి కోసం వడ్డీవ్యాపారుల వద్ద కు పోకుండా యాళ్లకు పైసలు వేసి ఆదుకుండు.
-మన్నె సాయిలు రైతు, బోర్లం
రైతు కష్టం తెలిసిన కేసీఆర్
ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే పెట్టుబడికి పైసలు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం ఇస్తుండడంతో కష్టాలు తీరాయి. ఆయనకు రుణపడి ఉంటాం. రైతుల కష్టం కేసీఆర్కు తెలుసు .
-జి.భీమయ్య, రైతు, ఖానాపూర్
యాళ్లకు పైసలు అచ్చినయ్
వానకాలంలో పంటలు సాగు చేసేందుకు పైసల కోసం ఎదురు చూస్తున్నం. మాకు సీఎం కేసీఆర్ సార్ పుణ్యంతో రైతుబంధు పైసలు నా ఖాతాలో యాళ్లకు పడ్డయి. సెల్ఫోన్కు మె స్సేజ్ కూడా వచ్చింది. అకౌంట్లో పడ్డ పైసలతో విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని పంటలు వేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
– గిరి, రైతు, ఖానాపూర్