కాంగ్రెస్ నేతలు రోడ్డున పడి తన్నుకున్నారు. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. రచ్చబండ కార్యక్రమేమో కానీ.. రచ్చ రచ్చ చేశారు. పరస్పర దాడులతో వీరంగం సృష్టించారు. స్థానికులను భయాందోళనలకు గురి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం ఆ పార్టీలోని విభేదాలను మరోమారు బహిర్గతం చేసింది. పార్టీ ఐటీ సెల్ కన్వీనర్ మదన్మోహన్రావు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల వారు ఒకరినొకరు దూషించుకుంటూ రాళ్లు, కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.
కామారెడ్డి, జూన్ 24: తెలంగాణ పీసీసీ ఐటీ సెల్ కన్వీనర్ కే.మదన్ మోహన్రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డెపల్లి సుభాష్రెడ్డి మధ్య పచ్చి గడ్డివెస్తే భగ్గుమంటోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం ఇరువర్గాల మధ్య ఘర్షణ, దాడులకు దారి తీసింది. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. పరుష పదజాలంతో దూషణలు చేసుకుంటూ దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలకు చెందిన నేతలు పరస్పరం ఫిర్యాదు చేయడంతో రాజంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరుసగా దాడులు, ప్రతిదాడులు
రాబోయే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందంటూ మోహన్రావు, వడ్డెపల్లి సుభాష్రెడ్డి వర్గాల నేతలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఒకవర్గాన్ని మరో వర్గం నేతలు అడ్డుకోవడం, దాడులకు పాల్పడడంపై పార్టీలో కొట్లాట కొనసాగుతోంది. శుక్రవారం రాజంపేట మండలంలోని కొండాపూర్, ఆర్గొండ గ్రామాల్లో ఐటీసెల్ కన్వీనర్ మదన్మోహన్రావు రచ్చబండ ముగించి ఎల్లారెడ్డి పల్లితండాలో కార్యక్రమం కొనసాగిస్తున్న సమయంలో సుభాష్రెడ్డి అనుచరులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో గ్రామస్తులు నిశ్చేష్టులయ్యారు. మదన్మోహన్ రావును కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సస్పెండ్ చేసిందని గ్రామాల్లో పార్టీ పేరుతో తిరగడం ఏమిటని సుభాష్రెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకుడిని అధిష్టానం సస్పెండ్ చేయలేదని, ఉత్తర్వులు ఇవ్వలేదని మదన్మోహన్ వర్గీయులు చెబుతున్నారు. ఇరువర్గాల దాడుల్లో సుభాష్రెడ్డి వర్గానికి చెందిన సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన జైపాల్రెడ్డికి, మదన్మోహన్రావు వర్గానికి చెందిన గాంధారి మండలానికి చెందిన తూర్పు రాజులుకు గాయాలయ్యాయి. వారు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. రాజంపేట పోలీస్ స్టేషన్లో సుభాష్రెడ్డి, మదన్మోహన్ వర్గీయులు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
కాంగ్రెస్ గ్రూప్ వార్కు కేరాఫ్ ఎల్లారెడ్డి
కాంగ్రెస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా, పార్టీ కోఆర్డినేటర్గా వడ్డెపల్లి సుభాష్రెడ్డి కొనసాగుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుచరుడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుభాష్రెడ్డికి మాజీ మంత్రి షబ్బీర్ అలీతో సాన్నిహిత్యం ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కన్నేసిన మదన్ మోహన్రావు కొంతకాలంగా ఆయా మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మార్చిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎల్లారెడ్డిలో బహిరంగసభ నిర్వహించిన సమయంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగి రచ్చకెక్కారు. రేవంత్రెడ్డి పర్యటనకు రెండు రోజుల ముందే ఎల్లారెడ్డితోపాటు పలు మండలాల్లో ఫ్లెక్సీల చించివేతతో మొదలైన విభేదాలు రోడ్డుకెక్కాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీని కాదని, మదన్మోహన్రావు ప్రత్యేక ఆఫీస్ను తెరిచాడు. దీంతో షబ్బీర్అలీ కన్నెర్ర చేశారు.
షబ్బీర్ అలీకి పోటీగా క్యాడర్ ఏర్పాటుతోపాటు కామారెడ్డిలో మదనన్న పేరుతో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ను ఆహ్వానించారు. ఇది మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆగ్రహానికి మరో కారణమైంది. తన సొంత నియోజకవర్గంలో తనకు సమాచారం ఇవ్వకుండా పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అజారుద్దీన్ రావడంపై షబ్బీర్అలీ గుస్సాకు కారణమైంది. అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అజారుద్దీన్ ప్రకటించడంతో షబ్బీర్అలీ తీవ్ర అసహనానికి కారణమైంది.
జిల్లాలోని సొంత బలగాన్ని పెంచుకుంటున్నారనే నెపంతో ఇటు షబ్బీర్ అలీకి, అటు మదన్మోహన్రావుకు మరింత గ్యాప్ పెరుగుతూ వస్తుందనే ప్రచారం నెలకొంది. తన అనుచరుడిగా ముద్రపడిన వడ్డెపల్లి సుభాష్రెడ్డికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నియోజకవర్గంలో కార్యక్రమాలకు ప్రోత్సహించడంపై మదన్ మోహన్రావు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. గత నెల లింగంపేట మండలంలో ఇరువర్గాలు రచ్చబండ కార్యక్రమంలో దాడులకు దిగిన ఘటనలో పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం రాజంపేట పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
మదన్మోహన్ను అడ్డుకుంటాం
మదన్మోహన్రావును కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా గ్రామాల్లో తిరగడం ఏమిటి. గ్రామాల్లో తిరిగితే అడ్డుకుంటాం. పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేకుండా గ్రామాల్లో తిరుగుతున్నాడు. వడ్డెపల్లి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రచచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో తిరిగితే అడ్డుకుంటాం, బుద్ధి చెబుతాం.
– కమిలి బాల్రాజ్, గాంధారి కాంగ్రెస్ నేత
అధిష్టానం సస్పెండ్ చేయలేదు
తెలంగాణ టీపీసీసీ ఐటీ సెల్ కన్వీనర్గా ఉన్న మదన్ మోహన్రావును పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయలేదు. మదన్ మోహన్రావు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం రాజంపేట మండలంలో చేపట్టాం. నాగిరెడ్డిపేట్లో కార్యక్రమం చేపట్టగా వడ్డెపల్లి సుభాష్రెడ్డి అనుచరులు వచ్చి అడ్డుకుని దాడులకు దిగారు. గాంధారి మండలానికి చెందిన తూర్పు రాజులుకు గాయాలయ్యాయి. అదిష్టానానికి ఫిర్యాదు చేస్తాం.
– సయ్యద్ ఇర్షాద్,మాజీ కోఆప్షన్ సభ్యుడు, సదాశివనగర్