నిజామాబాద్ క్రైం, జూన్ 21: ‘నమస్తే తెలంగాణ’దినపత్రికలో ప్రచురితమైన కథనంపై నిజామాబాద్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అంతర్రాష్ట్ర సైలెన్సర్ దొంగల గ్యాంగ్ను పట్టుకున్నారు.‘సైలెంట్’గా ఎత్తుకెళ్తున్నారనే శీర్షికన ఏప్రిల్ 29వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక నిజామాబాద్ జిల్లా ఎడిషన్లో కథనం ప్రచురించారు. దీంతో సీపీ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి సైలెన్సర్ దొంగల ముఠాను పట్టుకొనేందుకు కార్యాచరణ ప్రారంభించారు. సుమారు 50 రోజుల పాటు జిల్లా పోలీస్ బృందాలు విస్తృతంగా శ్రమించి చివరకు ముఠాను పట్టుకున్నాయి. నిజామాబాద్ కమిషనరేట్లో సీపీ కె.ఆర్.నాగరాజు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మారుతి ఈకో వాహన సైలెన్సర్ల చోరీపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని కేవలం ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. మూడు నెలలుగా నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్లో ఈ ముఠాపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్ బాబు సూచనలతో నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది సైలెన్సర్ దొంగల కోసం అన్వేషణ ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా 20వ తేదీ రాత్రి నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గాం(పీ) వద్ద సిబ్బందికి అందిన సమాచారంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ వై.రాజశేఖర్, నగర సీఐ కృష్ణ, ఎస్సై సందీప్ కారులో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వారిని పట్టుకొని విచారించినట్లు సీపీ వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మహ్మద్ వసీం, మహ్మద్ సోహెల్, మహ్మద్ జాకీ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 12 సైలెన్సర్లు పట్టుబడినట్లు తెలిపారు. వాటి విలువ రూ.5లక్షల50 వేలు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటు 12 బాక్సుల్లో (ప్లాటినం,రోడియం,పలాడియం)కేటాలిటికల్ కన్వర్టర్ మిశ్రమ లోహం సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ముఠాను పట్టుకునేందుకు ఏసీపీ వెంకటేశ్వర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వై.రాజశేఖర్, ఎస్సై సందీప్, ఏఎస్సై భీమ్రావు, హెడ్కానిస్టేబుళ్లు రాములు, యాకూబ్ రెడ్డి, రిజ్వాన్, రాజు, రమేశ్, కానిస్టేబుళ్లు బాలకిషన్, కాశయ్య, రాజేందర్ సింగ్, శ్రీనివాస్, హోంగార్డు హనుమంత్లను సీపీ అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులతో సత్కరించారు.