నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 21;జిల్లా వ్యాప్తంగా ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. యోగా శిక్షణ శిబిరాలతోపాటు పాఠశాలల ఆవరణలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసనాలు వేశారు. యోగా శిక్షకులు ఆసనాలు వేయించారు. నిత్యం యోగా చేస్తే కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా వివరించారు.
యోగాతో మానసిక ప్రశాంతత : కలెక్టర్
ప్రతిరోజూ యోగా చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశు మందిర్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ యూనిట్, ఆయూష్ మంత్రిత్వ శాఖ, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో మంగళవారం 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు.
ఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే యోగా ఉత్తమమైన సాధనం అని అన్నారు. అనంతరం యోగా గురువులు, యోగాలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఆర్డీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, యోగా గురువు గరిపల్లి అంజయ్య, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, అంజయ్య, ఎల్లంకి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.