ఇందూరు, జూన్ 17 : ప్రతి నివాస ప్రాంతంలో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్లెప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలం లేని చోట పాఠశాలలు, ఆలయాలు, గ్రామచావిడి, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీ, గ్రామపంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ స్థలాలను క్రీడా ప్రాంగణాల కోసం ఎంపిక చేయాలన్నారు. స్థలాల గుర్తింపు పూర్తయిన చోట తక్షణమే పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. వచ్చే సోమవారం నాటికి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవోలు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
మోర్తాడ్, డిచ్పల్లి మండలాల్లో పూర్తిస్థాయిలో అన్ని హ్యాబిటేషన్లలో క్రీడా ప్రాంగణాలు గ్రౌండింగ్ చేయడంపై సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందించారు. ఎంతో ప్రాధాన్యంతో కూడిన పనిగా దీనిని గుర్తిస్తూ ఇతర మండలాల్లోనూ క్రీడా ప్రాంగణాలు త్వరిగతిన ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వైకుంఠధామాలను వినియోగించుకునేలా చూడాలని, అవసరమైతే గ్రామపెద్దలు స్థానికులతో మాట్లాడాలని సూచించారు. కంపోస్ట్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేస్తూ ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయ వనరులు పెంపొందించాలన్నారు.
మోపాల్ మండలం సింగంపల్లి గ్రామపంచాయతీ సేకరించిన చెత్త ద్వారా వేరు చేసిన వస్తువుల విక్రయం ద్వారా 35 వేల రూపాయల ఆదాయం ఆర్జించడంతో గ్రామ కార్యదర్శిని కలెక్టర్ అభినందించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను మళ్లీ వినియోగంలోకి తేవడంతో జీపీలకు ఆదాయం సమకూరడమే కాకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతారన్నారు. గ్రామ పంచాయతీలు చెత్త రీసైక్లింగ్లో పోటీ పడాలని, ఇక నుంచి తాను క్రమం తప్పకుండా సమీక్షిస్తానని అన్నారు. పల్లెప్రగతి ముగిసినప్పటికీ చేపట్టిన పరిశుభ్రత పనులు నిలిపివేయరాదన్నారు. అన్ని జీపీలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో గుర్తించి ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. వారం రోజుల్లో మొక్కలు నాటే ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. ఎక్కడ కూడా వేలాడుతున్న విద్యుత్ తీగలు విరిగిన, వంగిన విద్యుత్ స్తంభాలు ఉండరాదన్నారు. ఇరిగేషన్ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సమగ్ర కార్యాచరణతో సమాయత్తం కావాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈ వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ పాల్గొన్నారు.