నిజామాబాద్ క్రైం, జూన్ 14 : జియో టవర్లకు ఉపయోగించే విలువైన బ్యాటరీలను దొంగిలించే అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్టు చే శారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన జల్లు గ్యాంగ్లో 8 మంది సభ్యులు ఉన్నారు. జియో టవర్ల వద్ద వినియోగించే బ్యాటరీల ఖరీదు సుమారు రూ. లక్ష నుంచి లక్షా 20 వేల వరకు ఉం టాయి. ఈ బ్యాటరీలను ఎత్తుకెళ్లడమే ఈ ముఠా పనిగా పెట్టుకున్నది. ఈ ముఠా మన రాష్ట్రంతోపాటు ఇటు ప్రాంతాల్లోనూ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడింది. ఎవరికీ అనుమానం రాకుండా కారులో తిరుగుతూ జాతీయ రహదారులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న జియో టవర్ల వద్దకు వెళ్లి బ్యాటరీలను ఎత్తుకెళ్తారు. జిల్లాలోనూ బ్యాటరీలు ఎత్తుకెళ్లిన సంఘటనలపై ఫిర్యాదులు వచ్చాయని సీపీ తెలిపారు.
ఈ నెల 13వ తేదీ రాత్రి సమయంలో జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముఠా సభ్యుడిని పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 8 మంది సభ్యులు ఉన్న ఈ ముఠాలో మీరట్ జిల్లాలోని శివమందిర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫర్హాన్ అలియాస్ ఫర్రూ పోలీసులకు చిక్కగా ఏడుగురు పరారయ్యారని తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్, జక్రాన్పల్లి ఎస్సై తమ సిబ్బందితో కలిసి ముఠా సభ్యుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.నిందితుడి వద్ద నుంచి రూ.25.36 లక్షలు విలువ చేసే 33 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఒక కారు, సెల్ఫోన్ సీజ్ చేసినట్లు వివరించారు. ముఠా సభ్యుడిని పట్టుకునేందుకు కృషి చేసిన ఏసీపీ ఏ.వెంకటేశ్వర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వై.రాజశేఖర్, జక్రాన్పల్లి ఎస్సై కె.శ్రీకాంత్, కానిస్టేబుళ్లు రాజేశ్వర్, భూపతిలను సీపీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ రాజశేఖర్, ఎస్సై శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రంగంలోకి దింపనున్నట్లు సీపీ నాగరాజు వెల్లడించారు.